గన్నవరం నియోజకవర్గంలో ధాన్యం సేకరణ చేయాలి
ఆరుగాలం కష్టపడే రైతు పండించిన పంటకు సరైన ధర చెల్లించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, భవిష్యత్తుకు భరోసా కల్పించడమే రైతుకి ఇచ్చే నిజమైన గౌరవమని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో నియోజకవర్గంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు జమ అయ్యే పరిస్థితి వచ్చిందని.. రైతు తాము పండించిన పంటను RSKల ద్వారా సులభంగా మిల్లులుకు తరలించే సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. కృష్ణాజిల్లా లో ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అలానే గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 15 వేల ఎకరాలలో 44 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేయాల్సి ఉందన్నారు. సివిల్ సప్లై శాఖ వారు ఈ సమస్యలపై దృష్టి సారించి రైతుల ధ్యానం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా *సంబంధిత శాఖకు పలు సూచనలు* చేశారు. జిల్లా PPC కోటాను డివిజన్ వారీగా వరి పంట ప్రాంతాల ఆధారంగా విభజించాలని మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా పంట కోసిన ప్రాంతాలను వరి సేకరణ కోసం పరిగణించాలని సూచించారు. కలెక్టర్లు ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర మరియు ఊహించని పరిస్థితులలో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా బాధిత రైతులకు సహాయం చేయడాని ప్రత్యేక అధికారాలు జారీ చేయాలని కోరారు.
వైసీపీ హయాంలో సనాతన ధర్మం పై, ఆలయాల పై దాడులు
2019-24 వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం పై, ఆలయాల పై దాడులు జరిగాయని గుర్తు చేశారు. అంతర్వేదిలో నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసిన ఘటన, రామతీర్థంలో రాముల వారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన , విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి రధం దొంగిలించిన ఘటన , శ్రీశైలం లో కుంభాభిషేకం జరగకుండా ఆపేసిన ఘటనలు, కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘటనలు జగన్ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అధర్మ పనులు చేసి అపకీర్తిని మూట కట్టుకుందని చెప్పారు. తాను అమ్మవారి ఆలయంలో వెండి పల్లకి సమర్పిస్తే అది, ఉందొ లేదో తెలుసుకోవడానికి తనకు రెండు నెలల సమయం పట్టిందని చెప్పారు. రాష్ట్రం లో జగన్ సీఎం గా ఉన్నపుడు ఎన్ని అక్రమాలు దేవాదాయశాఖ లో జరిగినా ఏనాడు క్షేత్ర స్థాయి కి ఆయన వెళ్లి పరిశీలించ లేదనీ.. నివారణకి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. తిరుమల లో స్వామి వారు మీద విశ్వాసం ఉంచి సెల్ఫ్ డిక్లరేషన్ మీద కూడా వైఎస్ జగన్ ఏనాడు సంతకం చేయలేదని అన్నారు. రాజకీయాలల్లో ఉన్న వాళ్ళు అన్నీ మతాలను, ధర్మాలను గౌరవిస్తూ సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్నారు. తమరు కూడా అప్పట్లో ఈ విషయాలు ప్రశ్నించారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కు గుర్తు చేశారు. గన్నవరం నియోజకవర్గం లోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల అభివృద్ధి, సంరక్షణ కు నిధులు కేటాయించాలని సంబధిత మంత్రి నీ కోరారు. తన స్వగ్రామం పెనుమత్స లో 500 సంవత్సరాల పురాతనమైన శైవక్షేత్రం ఉందని ఈ ఆలయం శిల్ప శైలి మొత్తం చోళుల కాలం నాటిదని దేవాదాయ శాఖ అధికారి స్టపతి నిర్ధారించారని చెప్పారు. ఈ శివాలయాన్ని పునర్ నిర్మాణం చేయాలని ఇందుకోసం
ఇందుకోసం మూడున్నర కోట్ల రూపాయిలు సీజీఎఫ్ నిధులు మంజూరు చేయాలని తాను పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా లెటర్ లు కూడా పెట్టమని సభకు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయం ఎదుట ఉన్న వెటర్నరీ కళాశాల ప్రహరికి మరమ్మత్తులు చేయాలి
బ్రిటిష్ కాలంలో వెటర్నరీ సిస్టం బ్రహ్మాండంగా ఉండేదని కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్ది ప్రాధాన్యత కోల్పోతుందని చెప్పారు. వెటర్నరి సిస్టం ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతు సోదరులు పాడిపరిశ్రమ పై ఆధారపడతారని కానీ పశు వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తన నియోజకవర్గంలో గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ఉందని ఆ కళాశాల కళవిహీనంగా తయారైందని అందుకు ఆ కళాశాల ప్రహరీ గోడ సాక్ష్యమని చెప్పారు. మరమ్మతుల కోసం రూ.56 లక్షలు కేటాయించాలని కోరామని వాటిని మంజూరు చేయాలని కోరారు.
కెడిసిసి బ్యాంకు లో 2023లో కొనుగోలు చేసిన TCS సాఫ్ట్వేర్ అంశం పై విచారణ జరపాలి
KDCCB మీద తాను చైర్మన్ గా ఉన్న హయాంతో సహా 51 ఎంక్వయిరీ వేయమని నవంబర్ లో మంత్రి ఆదేశిస్తే ఇప్పటికీ ఎంక్వయిరీ మొదలు కాలేదన్నారు.
2013లో ఆంధ్ర బ్యాంకు తీసేసిన TCS సాఫ్ట్వేర్ ను 2023లో కొనుగోలు చేశారని Polaris తరువాత కొన్న TCS సాఫ్ట్వేర్, వలన ఇప్పుడు ఏమాత్రం ఉపయోగం లేదని అప్ గ్రేడ్ చేస్తే సరిపోతుందని ఐఏఎస్ అధికారి వాణికి కూడా చెప్పానని ఆమె తనతో ఏకీభవించిదని చెప్పారు. తాను బ్యాంక్ చైర్మన్ గా తప్పుకున్న వెంటనే వాటిని కొనుగోలు చేసారని ఆరోపించారు. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం తీసేసిన సాఫ్ట్వేర్ ఎవరైనా కొంటారా? ఇది చాలా నిర్లక్ష్యమయిన, అవినీతిమయిన నిర్ణయమని దీనిమీద ఎంక్వయిరీ వేయాలని కోరారు.
విజయ డైరీ పై ఎంక్వయిరీ వెయ్యాలి
విశాఖ డైరీ తరహాలో విజయ డైరీ పై విచారణ చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేసిన నిందితులే ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లగా, పార్లర్ ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు జగన్ అనే వ్యక్తికి ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. విశాఖ డైరీ పై విచారణ జరిగిన తర్వాత ఉద్యోగులకు జీతాలు పెరిగాయని, పాల రేట్ కూడా పెంచారని చెప్పారు. విజయ డైరికి సంబంధించి వైసీపీ వారికే ఎక్కువ మిల్క్ బూత్ లు కేటాయించారని ఆరోపించారు. వీటిలో అవకతవకలు జరిగాయని చెప్పారు.విశాఖ డైరీ లానే విజయ డైరీ పై కూడా ఎంక్వరి చేయాలని సంబంధిత మంత్రి నీ యార్లగడ్డ కోరారు.