Home Andhra Pradesh ఖిల్లాపై యోగా సాధ‌కుల థిల్లానా..

ఖిల్లాపై యోగా సాధ‌కుల థిల్లానా..

4
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 14, 2025

ఖిల్లాపై యోగా సాధ‌కుల థిల్లానా..

ప్ర‌కృతి ర‌మ‌ణీయం.. ఆస‌నాలు క‌మ‌నీయం

యోగా ల‌య‌ల‌తో పుల‌కించిన కొండ‌ప‌ల్లి ఖిల్లా

  • వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన ప్రభుత్వ ఉద్యోగులు
  • ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సార‌థ్యంలో అద్భుతంగా సాగిన యోగాంధ్ర‌

చారిత్ర‌క‌, సాంస్కృతిక వైభ‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన కొండ‌ప‌ల్లి ఖిల్లాపై ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త మ‌ధ్య యోగా సాధ‌కుల థిల్లానా అద్భుతంగా సాగింది. యోగాస‌నాల శ్వాస ల‌య‌ల‌తో కొండ‌ప‌ల్లి ఖిల్లా పుల‌కించింది. యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సార‌థ్యంలో శ‌నివారం కొండ‌ప‌ల్లి కోట‌పై ప్ర‌త్యేక యోగాస‌నాల అభ్య‌స‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, ఏపీఎన్‌జీజీవో అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్‌.. వంద‌లాది స్థానికులు, ఉద్యోగులతో క‌లిసి యోగాస‌నాలు వేశారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా మే 21 నుంచి పండ‌గ‌లా ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణంలో యోగ సాధ‌న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ప‌ర్యాట‌క ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే గాంధీ హిల్‌, ప‌విత్ర సంగ‌మం, హ‌రిత బెరం పార్కులో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని, శ‌నివారం హ‌రిత శోభ‌కు, చారిత్ర‌క ఔన్న‌త్యానికి నిలువుట‌ద్దంగా ఉన్న కొండ‌ప‌ల్లి ఖిల్లాపై యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. మ‌న చారిత్ర వార‌స‌త్వ సంప‌ద అయిన యోగా నేడు విశ్వ‌వ్యాప్త‌మైంద‌ని, బీపీ, మ‌ధుమేహం, హార్మోన్ల అస‌మ‌తుల్యం వంటి జీవ‌న‌శైలి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు యోగా రామ‌బాణం అని పేర్కొన్నారు. 45 నిమిషాల కామ‌న్ యోగా ప్రోటోకాల్‌ను నేర్చుకొని ప్ర‌తిరోజూ యోగ సాధ‌న‌ను భాగం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాల‌న్నారు. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త అయిన విక‌సిత్ భార‌త్‌, స్వ‌ర్ణాంధ్ర ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో భాగంగా ఆరోగ్యక‌ర స‌మాజ నిర్మాణానికి యోగాస‌నాలు పునాది వేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

*జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు నిరాంటంకంగా జ‌రుగుతున్నాయ‌ని, ప్ర‌తి ఒక్కరూ యోగాస‌నాల ఆచ‌ర‌ణ‌కు రోజులో కొంత స‌మ‌యాన్ని కేటాయించాల‌ని సూచించారు. యోగాతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం సొంత‌మ‌వుతుంద‌ని, ప‌ర్యాట‌క ప్రాంతాలపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, యోగా ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేందుకు ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల్లో యోగాంధ్ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌పంచానికి మ‌న దేశం ఇచ్చిన గొప్ప కానుక యోగా: ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్
ప్ర‌పంచానికి మ‌న దేశం ఇచ్చిన గొప్ప కానుక యోగా అని, ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రంగా ఉన్న కొండ‌ప‌ల్లి ఖిల్లాపై జ‌రిగిన యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్య‌క్షులు ఎ.విద్యాసాగ‌ర్ అన్నారు. మే 21 నుంచి యోగాంధ్ర మాసోత్స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని.. దేశ సంస్కృతి, వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయ‌ని.. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాల్లో ఏపీ ఎన్‌జీజీవో ఎప్పుడూ భాగ‌స్వామ్యం అవుతూ తోడ్పాటునందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఉద్యోగ విధుల్లో ఎదుర‌య్యే ఒత్తిడిని అధిగ‌మించి, మంచి ఫ‌లితాలు సాధించేందుకు యోగాస‌నాల అభ్య‌స‌న దోహ‌దం చేస్తుంద‌న్నారు. ఒత్తిడి ర‌హిత జీవితం కోసం యోగాను మ‌న దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల‌ని సూచించారు. ఇంత‌మంచి కార్య‌క్ర‌మంలో ఎన్‌జీజీవోను భాగ‌స్వామ్యం చేసినందుకు క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు విద్యాసాగ‌ర్ తెలిపారు.
అల‌రించిన క‌ళాత్మ‌క‌, సందేశాత్మ‌క సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు: కొండ‌ప‌ల్లి ఖిల్లాపై జ‌రిగిన యోగాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంతో సాగిన క‌ళాత్మ‌క ప్ర‌ద‌ర్శ‌న ప్రేక్ష‌కుల్లో దేశ‌భ‌క్తి స్ఫూర్తిని నింపింది. మ‌న వీర సైనికుల పోరాట ప‌టిమ‌, దేశం కోసం ప్రాణాల‌ర్పించిన సైనికుల త్యాగాల‌ను గుర్తుచేస్తూ సాగిన ప్ర‌ద‌ర్శ‌నపై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఈ ప్ర‌ద‌ర్శ‌న యోగాంధ్ర విశిష్ట‌త‌తో పాటు మ‌న‌కు మ‌నోధైర్యాన్నించింద‌ని పేర్కొన్నారు. మ‌న వీర‌సైనికుల త్యాగాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేమ‌న్నారు. శిరీష యోగా అకాడ‌మీ, ప్ర‌భుత్వ న‌ర్సింగ్ క‌ళాశాల విద్యార్థుల ప్ర‌ద‌ర్శ‌న‌లు యోగా ఔత్సాహికుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

  • కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రంగారావు, బి.జానకి, వి. సుబ్బారెడ్డి, ఎస్బీవీ రామ్ ప్రసాద్, బి.తులసి రత్నం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డీవీ రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు డి ఎస్ ఎన్ రెడ్డి, వివి ప్రసాద్, పి.రమేష్ సివిఆర్ ప్రసాద్, సిటీ కార్యవర్గ సభ్యులు సీహెచ్ నాగభూషణ, ఎన్జీవో నేతలు వి.శాంతిశ్రీ, మురళి, సరస్వతి, భారతీ ప్రసాద్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
  • అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ యోగా గురు స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా ప‌ర్యాట‌క అధికారి ఎ.శిల్ప‌, కొండ‌ప‌ల్లి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ర‌మ్య‌కీర్త‌న‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డా. ఎన్‌టీఆర్ వైద్య‌సేవ కోఆర్డినేట‌ర్ డా. జె.సుమ‌న్‌, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామ‌త్లేహి, డా. రత్న‌ప్రియ‌ద‌ర్శిని, ఏపీ ఎన్జీజీవో నేతలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here