ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 19, 2025
క్షయ నిర్మూలనకు కలిసికట్టుగా అడుగేద్దాం
విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
టీబీ ముక్త్ పంచాయతీల ద్వారా స్థానిక సంస్థలకు ప్రోత్సాహం
మరింత మంది నిక్షయ్ మిత్రాలుగా ముందుకొచ్చేలా చూడాలి
జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లాలో క్షయను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కలిసికట్టుగా అడుగేయాల్సిన అవసరముందని.. ఈ దిశగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ)-జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశం జరిగింది. ఎన్టీఈపీ కింద చేపడుతున్న టీబీ నియంత్రణ కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఉచిత మందుల పంపిణీ, నిక్షయ్ పోషణ్ యోజన తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో టీబీ నిర్మూలన కూడా ప్రధానమైందని, ముఖ్యంగా వల్నరబుల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 2018లో ఏర్పడిన జిల్లాస్థాయి టీబీ ఫోరం కమిటీ ఏడాదికి రెండుసార్లు సమావేశమవుతోందని.. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 10 టీబీ యూనిట్ల ద్వారా ఎన్టీఈపీ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షయను తొలిదశలోనే గుర్తించడం వల్ల మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని, ఈ నేపథ్యంలో స్క్రీనింగ్కు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధి ఒకరినుంచి మరొకరికి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ఛాంపియన్ల సహకారంతోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రోగికి చికిత్స సమయంలో నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రతినెలా రూ. వెయ్యి డీబీటీ ద్వారా అందించడం జరుగుతోందని.. ఇలాంటి ప్రభుత్వ మద్దతుతో పాటు మిగిలిన వారుకూడా నిక్షయ్ మిత్రలుగా ముందుకొచ్చి రోగులకు పోషకాహార బాస్కెట్లు అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయన్నారు. ప్రైవేటు ప్రాక్టీషనర్లు, ల్యాబ్స్, కెమిస్ట్స్ తదితరులు టీబీ కేసులపై ప్రభుత్వానికి సమాచారమిచ్చేలా పటిష్ట పర్యవేక్షణ అవసరమన్నారు.
క్షయ నియంత్రణలో వినూత్న చర్యలు చేపట్టే దిశగా స్థానిక సంస్థలను ప్రోత్సహించేందుకు టీబీ ముక్త్ పంచాయతీ కార్యక్రమాన్ని కూడా అమలుచేయడం జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా గుణదలకు చెందిన ఓ టీబీ ఛాంపియన్ వ్యాధిని జయించిన ఉదంతాన్ని వివరించారు.
సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, జిల్లా క్షయ నివారణ అధికారి డా. జె.ఉషారాణి, ఐఎంఏ సభ్యులు డా. రవీంద్రనాథ్, డీపీవో పి.లావణ్య కుమారి, వాసవ్య మహిళా మండలి సెక్రటరీ డా. జి.రష్మి తదితరులు పాల్గొన్నారు.