*28-12-2024*
క్రీడల్లో విద్యార్ధులను మరింతగా ప్రోత్సహించాలి : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
పి.బి. సిద్ధార్థ కాలేజ్ లో వాలీబాల్ టోర్నమెంట్-2025 పోస్టర్ పోస్టర్ ఆవిష్కరణ
పోస్టర్ ఆవిష్కరించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతికి 2027లో నేషనల్ గేమ్స్ రాబోతున్నాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మొఘల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ కాలేజ్ సెమినార్ హాల్లో శనివారం నిర్వహించిన 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్-2025 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపికేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. జనవరి 6 నుంచి 10 వ తేదీ వరకు జరగే 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్-2025 పోస్టర్ ను ఎంపికేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విద్యార్ధులను క్రీడల్లో మరింత ప్రోత్సహించాలన్నారు. విద్యతో పాటు క్రీడలకు మంచి భవిష్యత్తు వుందని, రాబోయే కాలంలో నైపుణ్యం గల క్రీడాకారులను తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తో స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్టేడియాల ఆధునీకరణ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. తమ కాలంలో క్రీడలకు ఇన్ని వసతులు లేవని…విద్యార్ధులు వున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అటు చదువుల్లో, ఇటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్న సమయంలో హైదరాబాద్ లో ఏషియన్ గేమ్స్ నిర్వహించారన్నారు.ఆ ఏషియన్ గేమ్స్ నిర్వహించిన విధానం కానీ, ఇందుకోసం నిర్మించిన స్పోర్ట్స్ సిట్సీ, స్టేడియాలు అంతర్జాతీయ స్థాయిలో వున్నాయని ప్రపంచం మొత్తం ప్రశంసించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 2027లో నేషనల్ గేమ్స్ లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్నాయన్నారు. చదువులతోపాటు విద్యార్ధులు క్రీడలపై దృష్టి పెట్టి అందులో కూడా రాణించాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో డి.ఐ.ఈ.వో. సి.ఎస్.ఎస్.ఎన్ రెడ్డి, పి.బి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు , 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి , మాజీ శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి , ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అండర్ 19 సెక్రెటరీ వి రవికాంత, అసిస్టెంట్ సెక్రటరీ కె.వి రాధాకృష్ణ లతో పాటు తదితరులు పాల్గొనటం జరిగింది.