కూనపరాజుపర్వ అభివృద్ధికి కృషి చేస్తా.
ఇప్పటికే గ్రామాభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు.
కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
వందరోజుల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తాం.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 21.08.2024.
రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామస్తుల, ప్రజల బహిరంగ ప్రజా ప్రయోజనాల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. వంద రోజుల్లో కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా కూనపరాజుపర్వ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హారతులు ఇచ్చి, పూలు వెదజల్లుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఘనస్వాగతం పలికారు. దివంగత నేత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కూనపరాజుపర్వ గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కూనపరాజుపర్వ గ్రామంలో విద్యుత్తు సమస్య, వివిధ సామాజిక వర్గాల స్మశాన వాటిక స్థలాల కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తెలియజేస్తామన్నారు. దశలవారీగా రహదారుల నిర్మాణం కూడా పూర్తి చేస్తామన్నారు. మైలవరం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. దీనికి సంబంధించి భూములు సిద్ధంగా ఉన్నాయని ఈ సమస్యను మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు అయితే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీ అప్పుల పాలైందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. వందరోజుల ప్రణాళికలతో గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరిస్తున్నారన్నారు. ముఖ్యంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుల ఊబిలో కూరుకున్న రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. తాజాగా విడుదల చేసిన 15వ ఆర్థికసంఘం నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికీ నీటికుళాయిలు ఏర్పాటు చేసి తాగునీరు ఇస్తామన్నారు. గ్రామాల్లో ఎల్ఈడీ వీధిలైట్ల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గ ప్రాంత సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు, రహదారుల అభివృద్ధి, చింతలపూడి ప్రాజెక్టు, ఎన్.ఎస్.పి వాటర్ రప్పించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని కొనియాడారు. స్ధానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.