కూటమితోనే అభివృద్ధి సాధ్యం
సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 44 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు జనసేన డివిజన్ అధ్యక్షురాలు మల్లెబోయిన విజయలక్ష్మి బిజెపి డివిజన్ అధ్యక్షులు లక్ష్మణరావు చలపాక డూండీ తో కలిసి విద్యాధరపురం అప్పలస్వామి క్వారీ లేబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సుజనా చౌదరి మాట్లాడుతూ అరవై ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి దశాబ్ద కాలంలో దేశంలో ప్రధాని మోడీ చేసి చూపించారు అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని దుయ్యబట్టారు. దేశ భవిష్యత్తు కోసం దేశంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లుగా ఏపీలో అరాచకం అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి చెందే విధంగా
పరిపాలన చేయలేదన్నారు. అమరావతిని అటకెక్కించి మూడుముక్కలాటలాడారన్నారు. కల్తీ మద్యం మాఫియాను ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేశాడని దుయ్యబట్టారు. ముస్లిం మైనారిటీల విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ముస్లిం మైనారిటీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉందని ముస్లింల రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా విద్యా వైద్యం మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నియోజవర్గాన్ని రోల్ మోడల్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ భారీ మెజారిటీతో విజ్ఞప్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జనసేన ఆంధ్రజోన్ కన్వీనర్ బాడిత శంకర్ బిజెపి నాయకులు పోతిన బేసు కంటేశ్వరుడు బెవరరాజు నాగు రౌతు రమ్యప్రియ లింగాల అనిల్ కుమార్ బిజెపి టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.