కూటమికే గిరిజన సంఘాల మద్దతు
జగన్ పాలనలో గిరిజనుల బతుకులు అస్తవ్యస్తం
విజయవాడ వెస్టులో సుజనాను గెలిపించుకుంటాం
గిరిజన సంఘాల నేతల ప్రకటన
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు గిరిజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపునకు ప్రచారం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక జగన్ మాట తప్పారని, ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్క గిరిజన నేతకు కూడా పదవి ఇవ్వలేదని ఆదివాసీ మేధావుల వేదిక ఏపీ అధ్యక్షుడు అనుముల వంశీకృష్ణ విమర్శించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేసే విధంగా ఉందని వంశీకృష్ణ చెప్పారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న యానాదులు ఎవరూ జగన్ హయాంలో అభివృద్ధి చెందలేదని బండి వెంకటేశ్వర్లు చెప్పారు. వైసీపీ పాలనలో ఎందరో యానాదులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ఓడించేందుకు గిరిజన సంఘాలు ఏకమయ్యాయన్నారు. జగన్ పాలనలో లంబాడీలు అన్యాయమయ్యారని, గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని కేశవ్ నాయక్ అన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి విజయం కోసం తామందరం కృషి చేస్తామని, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.