Home Political news కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు మంత్రి నాదెండ్ల మనోహర్

కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు మంత్రి నాదెండ్ల మనోహర్

2
0

 కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు 

• బియ్యం దందా కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ పని చేస్తోంది 

• అరబిందో కోసం కాకినాడ సీ పోర్టులో 41.12 శాతం వాటాను ఏ విధంగా దక్కించుకున్నారో ప్రజలకు తెలియాలి 

•  కె.వి.రావు కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించుకున్నారు

• జి.ఎం.ఆర్. నుంచి కాకినాడ ఎస్.ఈ.జడ్ లాక్కున్నారు

• గత ప్రభుత్వ పాలనలో కాకినాడ పోర్టులోకి ఎవర్నీ అడుగుపెట్టనీయలేదు

• మానస సంస్థకు కాకినాడ పోర్టులో 7 ఎకరాలు ఎలా కేటాయించారు?

• గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతులు 

• బియ్యం స్మగ్లింగ్ కోసం దేశ భద్రతనూ రిస్క్ లో పెట్టారు

• వ్యవస్థను ప్రక్షాళన చేసి బియ్యం మాఫియాను అరికడతాము

• మాఫియా వెనుక ఎలాంటి శక్తులు ఉన్నా వదిలిపెట్టం

• కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి 

• విజయవాడ మీడియా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్     

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయింది. తమ స్వలాభం కోసం దేశ భద్రతను పణంగా పెట్టింది. కాకినాడ పోర్టుకు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు దానిని స్మగ్లింగ్ డెన్ గా మార్చేసింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12శాతం వాటాను రాయించుకున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ. 48,537 కోట్లు విలువ చేసే బియ్యం ఎగుమతి అయ్యిందంటే బియ్యం మాఫియా ఏ విధంగా చెలరేగిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాల’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాఫియా జగన్ హయాంలో రెచ్చిపోయిందని స్పష్టం చేశారు. జగన్ పోర్టును తన ఆధీనంలోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎలా బెదిరించి, భయపెట్టి అరబిందో కు పార్టనర్ షిప్ కట్టపెట్టారో ప్రజలకు తెలపాలన్నారు. ఈ రేషన్ మాఫియాను అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సముద్రం లోపలకి వెళ్లారంటే అది ప్రజల కోసమేననీ, పేదల బియ్యం కాపాడాలనే తపనతో మేము పని చేస్తున్నామని వివరించారు. దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా అరికడతామని తెలిపారు. ఈ‌ ప్రక్షాళనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం అందిస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ అక్రమాలు అరి కట్టేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. బియ్యం మాఫియా వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మాఫియాను పూర్తిగా అరికడతామని తెలియ చేశారు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత, నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచే దాడులు మొదలుపెట్టాం. మొదట నా సొంత నియోజకవర్గం తెనాలిలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో తనిఖీలు చేశాం. అనంతరం విజయవాడలోని గొల్లపూడి గోదాములో తనిఖీలు నిర్వహించాం. రెండు చోట్ల చాలా అవకతకవలు గుర్తించాం. సమస్యను లోతుగా అధ్యయనం చేయాలని చాలా కసరత్తు చేశాం. ఈ ఏడాది జూన్ 28న కాకినాడలోని 13 గోదాముల్లో తనిఖీలు చేసి… 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. అందులో పరీక్షల తరువాత 25,386 మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యంగా నిర్ధారణ అయ్యింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ నియమించి రేషన్ మాఫియాతో సంబంధం ఉన్నా 13 కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. కేసులు నమోదైన 13 కంపెనీలు హైకోర్టును ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయాలని కోరాయి. కోర్టు ఆదేశాల మేరకు నాన్ పీడీఎస్ రైస్ ను ముందుగా రిలీజ్ చేశారు. అనంతరం రూ.84 కోట్ల బ్యాంకు గ్యారెంటీలతో పీడీఎస్ రైస్ ను రిలీజ్ చేశారు.  

• రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశారు 

రాష్ట్రంలో 29 వేల రేషన్ డిపోలు ఉన్నాయి. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వినియోగదారులకు సరుకును సక్రమంగా అందించేవి. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వారి స్వలాభం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.1600 కోట్లు ఖర్చు చేసి రేషన్ డోర్ డెలివరీ పేరిట 9,360 వ్యాన్లు కొనుగోలు చేశారు. ఈ వ్యాన్లు ద్వారా ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి రేషన్ బియ్యం స్మగ్లింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో 1.48 కోట్ల మందికి ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ అందిస్తున్నాయి. ఇందుకోసం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తోంది. కిలో బియ్యానికి ప్రభుత్వానికి రూ.43.40 ఖర్చు అవుతుంటే… వాటిని రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి ఈ మాఫియా కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇటు చిత్తూరు నుంచి అటు శ్రీకాకుళం నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం తరలించి కోట్ల ప్రజాధనం కొల్లగొట్టింది. 

• ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం

కాకినాడ పోర్టు మీదే కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టింది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఉంది. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదు. సామాన్యుల సంగతి పక్కనపెడితే జర్నలిస్టులనూ లోపలికి అనుమతించలేదు. అక్కడ ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. పకడ్బందీగా వ్యూహం రచించి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది. 

మన రాష్ట్రంలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో గంగవరం పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23,51,218 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 38,02,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే… ఒక్క కాకినాడ పోర్టు నుంచే 1,31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి. ఒక్క కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి జరిగిన బియ్యం విలువే రూ. 48,537 కోట్లు అంటే బియ్యం మాఫియా ఏ విధంగా రెచ్చిపోయిందో అర్థం చేసుకొవచ్చు.

• అరబిందో కంపెనీకి అసలు బాస్ ఎవరూ..? 

గత పాలకులు బియ్యం దందా కోసం దేశభద్రతను సైతం పణంగా పెట్టారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అరబిందో రియాల్టికి 41.12 శాతం వాటా ట్రాన్స్ ఫర్ అయ్యింది. అది ఎలా జరిగిందో ప్రజలకు తెలియాలి..? కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కె.వి.రావు, ఆయన కుటుంబాన్ని బెదిరించి 41.12 శాతం వాటా రాయించుకున్నారు. జీఎంఆర్ నుంచి ఎస్ఈజెడ్ లాక్కున్నారు. అరబిందో రియాల్టి కంపెనీకి అసలైన బాస్ ఎవరో ప్రజలకు తెలియాలి. గతంలో కూడా బియ్యం ఎగుమతులు ఈ పోర్టు నుంచి జరిగాయి. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. అరంబిందో కంపెనీ పోర్టు టేకోవర్ చేసిన తరువాత ఊహించని తీరిలో 1,31,18,346 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేశారంటే ఏ మేరకు దందా జరిగిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 

• పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది..? 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చి వెళ్లిన తరువాత వైసీపీ నాయకులు చాలా హడావుడి చేశారు? కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా చాలా మంది మీడియాతో మాట్లాడారు. వాళ్లందరికీ మేము ఒక్కటే అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? ఇక్కడ నుంచి గంజాయ్ స్మగ్లింగ్ జరగలేదని చెప్పగలమా..? వెపన్స్ రాలేదని చెప్పగలమా..? కాకినాడ పోర్టు 2,200 ఎకరాల్లో ఉంటే కేవలం 20 మంది పోలీసులు మాత్రమే భద్రత విధుల్లో ఉన్నారు. షిఫ్ట్ కు కేవలం 6 గురు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిది..? కాకినాడ పోర్టుకు చెడ్డపేరు తీసుకొచ్చింది ఎవరూ..? దానిని స్మగ్లింగ్ కు డెన్ గా మార్చింది ఎవరూ..? మానస కంపెనీకి పోర్టులో 7 ఎకరాల భూమిని కేటాయించిది ఎవరూ..? పోలీస్, రెవెన్యూ, పన్నులు, రవాణా శాఖలను దుర్వినియోగం చేసింది ఎవరూ..? అనేది ప్రజలకు తెలియాలి. 

• జగన్ సమాధానం చెప్పాలి 

కూటమి ప్రభుత్వం ఏనాడు ఒక వ్యక్తిపైనో, కుటుంబంపైనో కక్ష సాధింపుకు పాల్పడలేదు. వ్యవస్థలో పాతుకుపోయిన కుళ్లును ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కొల్లగొడుతున్నారు. ఉపాధి కల్పించే రైస్ మిల్లులను గుప్పెట్లో పెట్టుకున్నారు. కాకినాడ సీ పోర్టును చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజాధనం దళారుల చేతుల్లోకి వెళ్తున్నప్పుడు అరికట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. బియ్యం మాఫియాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ చేసిన ప్రయత్నం చాలా గొప్పది. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ జవాబు చెప్పాలి’’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్‌ చేశారు. 

ఈ మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, ఏపీ టిడ్కో ఛైర్మన్‌ వేములపాటి అజయ్ కుమార్, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ డా.పాకనాటి గౌతమ్ రాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here