ఎన్టీఆర్ జిల్లా, మే 30, 2025
కళాత్మక సౌందర్యం.. యోగానందం
కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉంది
అన్ని వర్గాలకు యోగాను చేరువచేసేందుకు కళాకారులు కృషిచేయాలి
- బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా ఆర్టిస్ట్ థీమ్ యోగా
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కళాకారులు సాంస్కృతిక వాస్తు శిల్పులు.. కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉందని, వారి కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేసేందుకు కళాకారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఆయుష్శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని నాట్యాచార్యులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతివర్గానికి యోగాను చేరువచేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా శుక్రవారం కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వ రోగ నివారిణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మందికి జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువచేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
45 నిమిషాల సరళ యోగా సర్వరోగ నివారిణి:
కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతిఒక్కరికీ యోగాను చేరువచేసేందుకు ప్రణాళిక ప్రకారం కృషిచేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్గా నామకరణం చేసి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. థీమ్ యోగాలో భాగంగా ఈ నెల 31వ తేదీన అన్నదాతలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ప్రిన్సిపల్ నరసమ్మ, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ప్రముఖ నాట్యాచార్యులు కళారత్న భాగవతుల వెంకట రామశర్మ, కళాక్షేత్ర నృత్య అకాడమీ హవీష చౌదరి, భక్తనారద గానసభ అధ్యక్షులు కళారత్న డా. ఆకురాతి కోదండరామయ్య, వివిధ కళా సంస్థల ప్రతినిధులు మల్లాది స్వాతి, రఘువేదం కిషోర్, అంబేద్కర్ సాంస్కృతిక సేవా సంఘం ప్రతినిధి జోషి, రుగ్వేదం సిస్టర్స్ గాయకులు పద్మశ్రీ, కృష్ణశ్రీ, లిటరరీ కల్చరల్ సర్వీస్ ప్రతినిధి బి.ఆంజనేయరాజు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డా. వి.రాణి, ఆయుష్ అధికారి డా. రామత్లేహి, పలువురు కళాకారులు, నాట్యాచార్యులు, గాయకులు పాల్గొన్నారు.