పత్రికా ప్రకటన
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 10, 2025
కళలు, కళాకారులకు అండగా కూటమి ప్రభుత్వం
- చేనేతను, హస్తకళలను, సంస్కృతిని కాపాడేందుకు విశేష కృషి
- సూపర్ జీఎస్టీతో చేనేత రంగంలో కొత్త ఉత్తేజం
- జీఎస్టీ సంస్కరణలతో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి
- గాంధీ శిల్ప బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అఖిల భారత హస్తకళా వస్తువులు, కళాత్మక వస్త్ర ప్రదర్శన, అమ్మకం వేదిక గాంధీ శిల్ప బజార్ను శుక్రవారం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, లేపాక్షి ఛైర్మన్ డా. పి.హరిప్రసాద్, ఎండీ ఎం.విశ్వ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించేలా ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు పది రోజుల పాటు శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా చేనేత, హస్తకళాకారుల ద్వారా సరికొత్త డిజైన్లు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీతో చేనేతతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి వీలుంటుందని.. జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందరికీ చేరువయ్యేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని.. చేనేత వస్త్రాలు ఆరోగ్యానీకి మేలు చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు అవార్డులు లభించాయని.. చీరాల పట్టు చీరలు, వెంకటగిరి కాటన్ చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం లేస్ అల్లికలు వంటివాటికి అవార్డులు లభించాయని మంత్రి తెలిపారు.
లేపాక్షి ఛైర్మన్ డా. పి.హరిప్రసాద్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్రంలో చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులను పెద్దఎత్తున ప్రోత్సహించడం జరుగుతోందని.. గాంధీ శిల్ప బజార్లో కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలు శిల్ప బజార్ను సందర్శించి, కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. కళలు, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.
లేపాక్షి వీసీ, ఎండీ ఎం.విశ్వ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషన్ సహకారంతో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్లో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, గద్వాల్, సిద్దిపేట్, నారాయణపేట్, చీరాల, కలంకారి, బాటిక్ ప్రింటింగ్, బెంగాలి కాటన్, కాశ్మీరి సిల్క్, కోసా సిల్క్, మధురై, లక్నో చికన్ వర్క్, నారాయణవరం, గాగ్రా చోళి, కాటన్ ప్రింటెడ్, సంబల్పూర్, కోసా (టస్సర్), ఆప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్, ఖాదీ మెటీరియల్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. హస్తకళా వస్తువులను, చేనేతలను కొనుగోలు చేసి, కళాకారులకు చేయూతనివ్వాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గాంధీ శిల్ప బజార్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
కార్యక్రమంలో లేపాక్షి ఓఎస్డీ ఐవీ లక్ష్మీనాథ్, కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషన్ ఏడీ అపర్ణా లక్ష్మీ, లేపాక్షి మేనేజర్ ఎం.సురేష్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
![]()
