
విజయవాడ 11/10/2025
కలెక్టరేట్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
- మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
- దేశ తొలి విద్యాశాఖ మంత్రి నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచన
బహుభాషా ప్రావీణ్యుడు, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యార్థులకు నిత్య స్ఫూర్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో ని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి కలెక్టర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ…భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాల పాటు పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. 35 సంవత్సరాల చిన్న వయసులోనే ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు. స్వతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితం గడిపారని, గాంధీ, నెహ్రూల ప్రశంసలు పొందారని చెప్పారు. అబుల్ కలాం ఆజాద్ కు అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, బెంగాలీ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉందన్నారు. తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన వేసిన పునాది వల్ల దేశం విద్యాపరంగా అభివృద్ధి సాధించగలిగిందని చెప్పారు. మౌలానాస్పూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ కోటేశ్వరమ్మ, జిల్లా ఈగల్ సీఐ ఎం.రవీంద్రనాథ్, మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
