కనకదుర్గమ్మ చల్లని ఆశీస్సులతో అభివృద్ధిపథంలో ఏపీ
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విజయవాడ : విజయవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రంపైనా, విజయవాడ నగర ప్రజలపైనా కనక దుర్గమ్మ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మవారికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సవితను అర్చకులు వేదాశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. లక్షలాదిగా తరలొస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నారు. కనక దుర్గమ్మ చల్లని దీవెనలతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంపైనా, విజయవాడ నగర ప్రజలపైనా కనక దుర్గమ్మ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మంత్రి ఆకాంక్షించారు.
అమ్మవారి ఉచిత దర్శనం
లక్షలాదిగా తరలొస్తున్న భక్తులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఆదివారం నుంచి దసరా ఉత్సవాలు ముగిసేవరకు ఉచిత దర్శనాలకు అనుమతిచ్చారన్నారు. అమ్మవారి దర్శనానికి స్త్రీ శక్తి పథకం ఎంతో దోహదం చేస్తోందని, సుదూరం నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారని మంత్రి సవిత తెలిపారు.
ఏర్పాట్లు భేష
కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి సవిత క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్లు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లన్నీ భేషుగ్గా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తంచేశారు. కొండపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను మంత్రి సవిత పరిశీలించారు. ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. భక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందని మంత్రి సవిత ప్రశంసించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన మంత్రి సవితకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఏడో రోజు ఆదివారం అమ్మవారు శ్రీమహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
![]()
