04-03-2025
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పరిశీలించిన ఎసిఎ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ ( ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్/విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ) స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులు ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈనెల 24, 30వ తేదీల్లో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచులకు సంబంధించి ముందస్తు ప్రణాళికలో భాగంగా క్రికెట్ స్టేడియం పనులను ఎసిఎ సభ్యులతో కలిసి ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ స్వయంగా పరిశీలించారని పేర్కొన్నారు. గ్రౌండ్ కెపాసిటీ మినహాయిస్తే అహ్మాదాబాద్ లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ క్రికెట్ స్టేడియం తయారు కానున్నట్లు తెలిపారు. గ్యాలరీలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ బ్యాక్సులను పరిశీలించి ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అలాగే పది సెకన్స్ లో గ్రౌండ్ అంతా వెలుగులు విరజిమ్మే ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐపీఎల్ మ్యాచ్ జరగబోయే సమయాన్ని ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ కార్పొరేట్ స్టైల్ లో సరికొత్త రూపులో క్రికెట్ అభిమానులకు కనిపిస్తుందని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.సి.ఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్ , కోశాధికారి దండుమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్ లతో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.