ఏపీలో ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు: డిజిపి
ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని.. ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం.
ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయికి అడ్డుకట్ట వేస్తున్నట్టు వివరించారు.
గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు.
మార్చి ఒకటి నాటికి లక్ష కెమెరాల ఏర్పాటు లక్ష్యం
నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. సీసీ కెమెరాలను దాతల, ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎక్కడ, ఎటువంటి క్రైమ్ జరిగిన ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలనేదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల స్పాట్లను గుర్తించడం జరిగిందని, రెండు లక్షల సీసీ కెమెరాలను ఆ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.