Home Andhra Pradesh ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఎన్‌హెచ్ 65 విస్త‌ర‌ణ‌

ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఎన్‌హెచ్ 65 విస్త‌ర‌ణ‌

3
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 13, 2025

ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఎన్‌హెచ్ 65 విస్త‌ర‌ణ‌

  • భాగ‌స్వామ్య ప‌క్షాల అభిప్రాయాల‌తో తుది డీపీఆర్‌
  • విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ – హైదరాబాద్ సెక్షన్ లో జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65ను ఆరు లైన్ల రహదారిగా విస్తరణలో భాగంగా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తుది డీపీఆర్‌ను పక్కాగా రూపొందించాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులకు సూచించారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ – విజ‌య‌వాడ ఎన్ హెచ్ 65 రహదారిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆరు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్ హెచ్ఎఐ, రెవెన్యూ, ఆర్ అండ్ బి, నగరపాలక సంస్థ తదితర శాఖలతో ఐకాన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాదు నుండి విజయవాడ సెక్షన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ 226 కిలోమీటర్ల మేర ఎన్ హెచ్ 65 రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించడం శుభపరిణామన్నారు. అయితే ప్రాజెక్టు రూపొందించడంలో అన్ని శాఖల సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ పక్కాగా ఉండాలన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ సమస్యను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాన వాణిజ్య, పరిశ్రమ కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలు ఎక్కువగా ఉండటంతో వ్యాపార వాణిజ్య కూడల్లుగా ప్రసిద్ధి చెందుతున్నాయన్నారు. ఎన్ హెచ్ 65 రహదారిలోని తెలంగాణ రాష్ట్రం మందోళ్ళ గూడెం గ్రామం నుండి ప్రారంభమై ప్రధానంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్ పల్లి, నకిరేకల్, సూర్యారావుపేట, కోదాడ మీదుగా నందిగామ, కీసర, పరిటాల, మూలపాడు, ఇబ్రహీంపట్నం నుండి గుంటుపల్లి విలేజ్ వరకు 266 కిలోమీటర్లను ఆరు లైన్ల రహదారిగా విస్తరించనున్నారన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే గుర్తించిన ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్స్ వద్ద విస్తరణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట మేజర్, మైనర్, వంతెనలు, అండర్ పాస్ లు, రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలు టోల్ ప్లాజాలు, బస్ బే, ట్రక్ లేబైలు తదితర నిర్మాణాలలో సంబంధిత శాఖలను ముందుగా సంప్రదించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇబ్రహీంపట్నం నుండి గొల్లపూడి వరకు హెవీ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని విస్తరణ ఉండాలన్నారు. బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు నీరు రహదారులపై ప్రవహించడాన్ని తక్షణమే పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఏ ఐ అధికారులను పార్లమెంట్ సభ్యులు ఆదేశించారు. నోవాటెల్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డుకు అలైన్మెంట్ పూర్తయిందని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఆరు లైన్ల రహదారి విస్తరణలో సంబంధిత శాఖల అభిప్రాయాలను పరిగణన‌లోకి తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డీపీఆర్ రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. శాఖల సమన్వయంతో విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విస్త‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), వసంత కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, డిసిపి ట్రాఫిక్ ఎం. కృష్ణమూర్తి నాయుడు. యన్ హెచ్ ఎఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.విద్యాసాగర్, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, ఆర్ అండ్ బి ఎస్ఈ జీబీ భాస్కరరావు, సంబంధిత మండలాల తహసిల్దార్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here