ఊర్మిళ నగర్ సమస్యలు పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఊర్మిళా నగర్ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
తెలియజేశారు. సుజనా చౌదరి ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం 47వ డివిజన్లోని ఊర్మిళనగర్, రెడ్డి కాలనీ, పార్క్ రోడ్, మసీద్ వీధి, ఏకలవ్య నగర్ , కరెంట్ ఆఫీస్ రోడ్డు ,తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ మొత్తం పరిశీలించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని సైడ్ కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తీసివేయాలని అధికారులను సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యే సుజనా చౌదరి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి రోడ్ల నిర్మాణం , డ్రెయిన్లు, తాగునీటి పైపులైన్లు, ఏర్పాటుచేసి ఊర్మిళా నగర్ ను అభివృద్ధి చేస్తారన్నారు.
ఊర్మిళా నగర్ రెడ్డి కాలనీలో త్రాగునీరు కలుషితమవుతుందని పలువురు మహిళలు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన కు తెలియజేయగా తాగునీటి పైపులకు లీకులు లేకుండా చూసి రక్షిత మంచినీరు అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సెక్రటరీలు సమన్వయంతో వ్యర్ధాలను తొలగిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో ఏఈ రవీంద్ర, టౌన్ ప్లానింగ్ డిసిపి చంద్రబోస్, గ్రంథం ప్రసాద్, ఎఈ అహ్మద్ ,
శానిటరి ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, నాయకులు టిడిపి డివిజన్ అధ్యక్షులు కొనికి కొండయ్య, సెక్రెటరీ వల్లభనేని ప్రసన్న ,జనసేన కోటి, విశ్వేశ్వరరావు, బిజెపి మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, లింగాల అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.