25-11-2024
ఎపిలో ప్రసాద్ పథకం కింద ఎంపికైన దేవస్థాన వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో ప్రసాద్ పథకం కింద ఆమోదం పొందిన ప్రస్తుత ప్రాజెక్టుల పరిస్థితి, వాటికి మంజూరు చేసిన నిధులు, వినియోగం పై పూర్తి వివారాలు, అలాగే ప్రసాద్ పథకం కింద కొత్త ప్రతిపాదనలు ఆమోదం తెలిపారా? లేదా పరిశీలనలో వున్నాయా అనే విషయం తెలపాలంటూ పలు ప్రశ్నలు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, కర్నూల్ ఎంపి బస్తిపాటి నాగరాజు, కియోంజర్ ఎంపి నబ చరణ్ మాఝీ, కుషి నగర్ ఎంపి విజయ్ కుమార్ దూబే లతో కలిసి సోమవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రిత్వ శాఖ ను అడగటం జరిగింది. అలాగే ఆంద్రప్రదేశ్ నుంచి ప్రసాద్ పథకం కోసం కొత్తగా వచ్చిన ప్రతిపాదన లు తెలిపటంతో పాటు వాటి పరిస్థితి వివరించాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిస్తూ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ కింద 46 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిలో అమరావతి, శ్రీశైలం, సింహాచలం వుండగా, అమరావతిలో యాత్రికుల సదుపాయాల అభివృద్ధి కోసం 2015-16 లో రూ. 27.77 కోట్లు నిధులు విడుదల చేయగా ఆ నిధులను వంద శాతం వినియోగించినట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధి కోసం 2017-18 లో రూ. 43.08 కోట్లు నిధులు విడుదల చేయగా ఆనిధులను వంద శాతం వినియోగించటం జరిగిందని చెప్పారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో యాత్రికుల సదుపాయాల అభివృద్ధి కోసం 2022-23లో రూ 54.04 కోట్లు నిధులు విడుదల చేయగా ఆనిధుల్లో రూ. 13.69 కోట్లు మాత్రమే వినియోగించినట్లు వివరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రసాద్ పథకం కింద కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం, నెల్లూరు జిల్లా లోని వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం అభివృద్ది చేయటానికి గుర్తించినట్లు తెలిపారు. ఈ పథకం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయని కొన్ని పరిశీలనలో వున్నాయన్నారు.అయితే కొన్ని ప్రతిపాధనలు
నిబంధనలకు అనుకూలంగా లేవని పేర్కొన్నారు