21-07-2025
ఎపిలో పి.ఎమ్.ఎస్.హెచ్.ఆర్.ఐ (PMSHRI) పథకం కింద మరిన్ని పాఠశాలలను చేర్చే అవకాశం
కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి వెల్లడి
*ఆంధ్రప్రదేశ్ లో పి.ఎమ్.ఎస్.హెచ్.ఆర్.ఐ (PMSHRI) స్కూల్ వివరాలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
పి.ఎమ్.ఎస్.హెచ్.ఆర్.ఐ పథకం కింద ఎపిలో 953 పాఠశాలలు, ఎన్టీఆర్ జిల్లాలో 29 పాఠశాలలు ఎంపిక
ఛాలెంజింగ్ మెథడ్ లో ఏడు దశల్లో 935 పాఠశాలలు ఎంపిక
ఈ పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో ఎంపికైన 29 పాఠశాలలకు రూ.1620.6 లక్షలు వినియోగం
ఢిల్లీ : భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PMSHRI) పథకం, దేశంలోని పాఠశాల విద్యా రంగాన్ని సమూలంగా మార్చే దిశగా కీలకంగా మారుతోంది. జాతీయ విద్యా విధానం – 2020 లోని ప్రతి అంశాన్ని ప్రదర్శించే విధంగా ఈ పాఠశాలలు రూపొందించబడతాయి.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో ఎంపికైన పాఠశాలల అభివృద్ది పూర్తైన తర్వాత మరిన్ని పాఠశాలలను ఈ పథకం కింద చేర్చాలనే ఆలోచనలో వున్నట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి వెల్లడించారు.
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను ఎపీలో పి.ఎమ్.ఎస్.హెచ్.ఆర్.ఐ పథకం కింద జిల్లాల వారీగా అభివృద్ది కోసం ఎంపిక చేసిన పాఠశాలల సంఖ్య, నిర్మించాల్సిన సుదుపాయాలు, నిధుల కేటాయింపు, ఈ పథకంలో కొత్త పాఠశాలలను చేర్చుకునే అవకాశం వుందా తెలియపర్చాలంటూ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద అత్యధికంగా కర్నూలు జిల్లాలో 54 పాఠశాలలు, విశాఖపట్నంలో కేవలం 6 పాఠశాలలు మాత్రమే ఎంపికైనట్లు తెలిపారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఈ పథకం కింద 29 కింద పాఠశాలలు ఎంపిక కాగా,ఈ పాఠశాలల కోసం రూ.3,404.1 లక్షలు నిధుల కేటాయించి, రూ.1628.2 లక్షలు నిధులు విడుదల చేసి, రూ.1620.6 లక్షలు వినియోగించినట్లు తెలిపారు.
ఈ పాఠశాలల అభివృద్ధిలో ప్రధానంగా సైన్స్ ల్యాబ్స్, స్మార్ట్ తరగతులు, డిజిటల్ బోర్డులు, LED లైటింగ్, గ్రంధాలయాలు, ఆటల మైదానాలు, మరియు ‘గ్రీన్ స్కూల్స్’ లక్ష్యంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ విద్యా విధానం – 2020లో పేర్కొన్న అన్ని అంశాలను ఆచరణలో పెట్టే విధంగా ఈ పాఠశాలలు తీర్చిదిద్దబడుతున్నాయి. పారదర్శక పోటీ పద్ధతిలో ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో విద్యార్థులకు సమాన అవకాశాలు, ఆధునిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి శ్రీ జయంత్ చౌధరీ వెల్లడించారు.
ఈ పాఠశాలలు విద్యార్థుల్లో కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా, సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధితో పాటు నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయన్నారు. ఈ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూములు, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు, ఎల్.ఈ.డి లైటింగ్, ఔషధ తోటలు, గ్రీన్ కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబడి విద్యార్థులకు ఆధునిక విద్యను అందించేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు..పారదర్శక పోటీ పద్ధతిలో ఈ పాఠశాలల ఎంపిక జరిగినట్లు తెలిపారు. ఈ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పిస్తుందని, ఆ ప్రతిపాదనలను ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఆమోదిస్తుందన్నారు..