*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 14, 2025*
ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం
– *ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహనతో విధులు నిర్వర్తించాలి*
– *చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించాలి*
– *పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైండింగ్ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో) పాత్ర కీలకమని.. వీరు ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన పెంచుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
ఈ నెల 27న ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 272 మంది పీవో, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. పోలింగ్కు ముందు సన్నద్ధత, పోలింగ్ స్టేషన్ నిర్వహణ, పోలింగ్కు అవసరమైన సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోల్ సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివిధ రకాల ఫారాలపైనా అవగాహన కల్పించారు. నేరుగా బ్యాలెట్ బాక్సు పనితీరును పీవో, ఏపీవోలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశముంది? వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలనే విషయాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకోవాలన్నారు. ఇదివరకు ఎన్ని ఎన్నికల విధుల్లో పాల్గొన్నా ప్రతి ఎన్నికను కొత్తదిగానే భావించి, అప్రమత్తంగా ఉన్నప్పుడే ఎన్నికలను విజయవంతంగా నిర్వర్తించేందుకు వీలవుతుందన్నారు. నిర్వర్తించాల్సిన విధుల గురించి క్రమశిక్షణతో తెలుసుకొని.. ఆత్మవిశ్వాసంతో పోలింగ్ ప్రక్రియకు సిద్ధమవాలన్నారు. పీవో, ఏపీవోలు నిర్వహించాల్సిన వివిధ ఫారాలు, రిజిస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ విధులను విజయవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన అవగాహన పెంపొందించుకునేందుకు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో డీఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, మాస్టర్ ట్రైనర్లు బి.బసవేశ్వరరావు, ఎస్కే సైదా సాహెబ్, కె.రాజశేఖర్, జె.రామకృష్ణ, ఎండీ హుస్సేన్, ఎండీ రఫీ, వి.కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు.