Home Andhra Pradesh ఎన్‌టీఆర్ జిల్లా, మే 11, 2024 జిల్లాలో ప్ర‌శాంత పోలింగ్‌కు స‌ర్వం...

ఎన్‌టీఆర్ జిల్లా, మే 11, 2024 జిల్లాలో ప్ర‌శాంత పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం

2
0


 ఎన్‌టీఆర్ జిల్లా, మే 11, 2024


జిల్లాలో ప్ర‌శాంత పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం


– హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌కు, రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు

– ఈ నెల 13న ఉద‌యం 5.30 గంట‌ల‌కు మాక్ పోలింగ్‌, ఏడు గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం

– డిస్ట్రిబ్యూష‌న్‌, రిసెప్ష‌న్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

– పోలింగ్ రోజున సేవ‌లందించేందుకు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు బెల్ ఇంజ‌నీర్లు అందుబాటు

– ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలి

– అర్బ‌న్‌లో 78-80 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 88-90 శాతం ఓటింగ్ శాతం ల‌క్ష్యంగా స్వీప్ కార్య‌క్ర‌మాలు

– పోలింగ్ కేంద్రాల‌కు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దు

– జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు


ఈ నెల 13న జ‌రిగే పోలింగ్‌ను ప్ర‌శాంత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎలాంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న‌ల‌ను తావులేకుండా, రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.

న‌గ‌రంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లోని స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య ఎన్నిక‌ల మీడియా కేంద్రంలో శ‌నివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ పోలింగ్‌కు చేసిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు. శ‌నివారం నిర్వ‌హించిన పోలింగ్ స్టేష‌న్లకు సిబ్బందిని అనుసంధానించే ర్యాండ‌మైజేష‌న్‌కు అనుగుణంగా ఆదివారం 1,792 పోలింగ్ స్టేష‌న్ల‌కు సంబంధించి పోలింగ్ పార్టీల ఏర్పాటుతో పాటు నియోజ‌క‌వ‌ర్గాల వారీ డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాల ద్వారా ఈవీఎం, ఇత‌ర పోలింగ్ మెటీరియ‌ల్‌ను పంపిణీ జ‌రుగుతుంద‌న్నారు. పోలింగ్ మెటీరియ‌ల్‌కు, సిబ్బందికి ఎలాంటి కొర‌త లేద‌ని.. 13 వేల మందికి పైగా సిబ్బందిని, మెటీరియ‌ల్‌ను త‌ర‌లించేందుకు జీపీఎస్ అనుసంధానం చేసిన 459 వాహ‌నాల‌ను ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలిపారు. 176 సెక్టార్ల ప‌రిధిలోని 186 రూట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని.. ఆదివారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల క‌ల్లా పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేష‌న్ల‌కు చేరుకునేలా ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌తి పోలింగ్ ప్రాంతంలో తాగునీరు, మ‌రుగుదొడ్లు, నీడ, కుర్చీలు, చ‌క్రాల కుర్చీలు, ప్రాథ‌మిక చికిత్స త‌దిత‌ర ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. 1,200 మంది కంటే ఎక్కువ ఓట‌ర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 త‌ర్వాత కూడా పోలింగ్ జ‌రిగే అవ‌కాశ‌మున్నందున లైటింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. పోలింగ్ స్టేష‌న్ల‌కు ఓట‌ర్లు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్ద‌ని సూచించారు. పోలింగ్ స్టేష‌న్‌లో మొద‌ట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ త‌ర్వాత అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఉంటాయ‌న్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో 17 మంది, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 20 మంది పోటీలో నిల‌వ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలిపారు. ఓట‌ర్లు ఎలాంటి గంద‌ర‌గోళానికి తావులేకుండా ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌రు స‌హాయ కేంద్రం సేవ‌లందిస్తుంద‌న్నారు. జిల్లాలో దాదాపు 17 ల‌క్ష‌ల 4 వేల వ‌ర‌కు ఓట‌ర్లు ఉండ‌గా.. 16 ల‌క్ష‌ల 86 వేల వ‌ర‌కు ఓట‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ స్లిప్ (వీఐఎస్‌)లను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. వివిధ కార‌ణాల వ‌ల్ల వీఐఎస్ పంపిణీ జ‌ర‌గ‌ని వారి స‌మాచారంతో ఏఎస్‌డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్‌డ్‌, ఎక్స్‌పైర్డ్‌, డూప్లికేట్‌) జాబితాల‌ను పోలింగ్ స్టేష‌న్ల వారీగా త‌యారు చేయ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. జిల్లాలో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో మీడియా స‌హ‌కారమందించాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు కోరారు.


రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ప‌టిష్ట ఏర్పాట్లు:

జిల్లాలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేశామ‌ని.. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు, రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. గుర్తించిన పోలింగ్ స్టేష‌న్ల‌లో వెబ్‌క్యాస్టింగ్‌, మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు త‌దిత‌ర ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 65-70 శాతం పోలింగ్ స్టేష‌న్ల‌లో వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ ఉంటుంద‌న్నారు. పోలింగ్ స్టేష‌న్ల‌లో సీఏపీఎఫ్ యేత‌ర వీడియోగ్ర‌ఫీ వంటి ఏర్పాట్లు ఉంటాయ‌న్నారు. ఈవీఎంల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు వ‌స్తే 15 నిమిషాల స‌మ‌యంలో స‌రిదిద్దేందుకు అనువుగా ఏర్పాట్లు చేశామ‌ని.. సెక్టార్ అధికారులు, అసెంబ్లీ లెవెల్ మాస్ట‌ర్ ట్రైన‌ర్లు (ఏఎల్ఎంటీ)ల‌తో పాటు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు చొప్పున బెల్ ఇంజ‌నీర్లు అందుబాటులో ఉంటార‌న్నారు. పోలింగ్ పూర్త‌యిన అనంత‌రం జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ‌, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి డిస్ట్రిబ్యూష‌న్ జ‌రిగిన చోటే రిసెప్ష‌న్ కేంద్రాలు ఉంటాయ‌ని.. అక్క‌డి ఇంట‌ర్మీడియెట్ స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఈవీఎంల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అదే విధంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌య‌వాడ ఈస్ట్‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి నోవా, నిమ్రా క‌ళాశాల‌ల్లో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. నోవా, నిమ్రా క‌ళాశాల‌ల్లో 27 స్ట్రాంగ్ రూమ్‌లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. 


ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌తి ఓట‌రు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు పిలుపునిచ్చారు. ఓట‌ర్ల‌ను జాగృతం చేసేందుకు ఇప్ప‌టికే వివిధ స్వీప్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అర్బ‌న్‌లో 78-80 శాతం వ‌ర‌కు, గ్రామీణ ప్రాంతాల్లో 88-90 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు. 


నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌

జిల్లాలో శాంతియుత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు పోలీస్ శాఖ‌.. వివిధ శాఖ‌లతో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తోంద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ స‌హ‌కారంతో ప‌క‌డ్బందీ కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లుచేస్తున్న‌ట్లు పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ తెలిపారు. సైలెన్స్ పీరియ‌డ్‌లో 144 సెక్ష‌న్ అమ‌లుతో పాటు అన్ని లిక్క‌ర్ దుకాణాలు మూసివేసి ఉంటాయ‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు విఘాతం క‌లిగించినా, నిబంధ‌న‌లు ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 332 లొకేష‌న్స్‌ను క్రిటిక‌ల్‌గా గుర్తించ‌డం జ‌రిగింద‌ని.. అదే విధంగా 267 లొకేష‌న్ల‌ను శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రంగా క్రిటిక‌ల్‌గా గుర్తించామ‌ని.. ఈ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, నాగాలాండ్ స్పెష‌ల్ పోలీస్ త‌దిత‌ర సిబ్బందిని నియ‌మించ‌నున్న‌ట్లు తెలిపారు. 400 వ‌ర‌కు స్ట్రైకింగ్ ఫోర్స్ ప‌నిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. 5 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది, 13 కంపెనీల ఆర్మ్డ్ ఫోర్స్‌తో పాటు 1,300 మంది ఎన్ఎస్ఎస్‌, 100 మంది ఎన్‌సీసీ వాలంటీర్లు కూడా సేవ‌లందించ‌నున్న‌ట్లు వివ‌రించారు. జిల్లాలో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు, ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here