*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 14, 2024*
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా..
– పర్యావరణ పరిరక్షణకూ గొప్ప మేలు
– ప్రతిఒక్కరూ పునరుత్పాదక ఇంధనం దిశగా అడుగేయాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరముందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఇంధన శాఖ – ఇంధన పరిరక్షణ మిషన్ (ఎస్ఈసీఎం), జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల (డిసెంబర్ 14 – 20) ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మన భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలన్నారు. సంప్రదాయ శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో కలిగే అనర్థాలను సరైన విధంగా అర్థం చేసుకొని పర్యావరణానికి తద్వారా మన ఆరోగ్యకర జీవితానికి మేలుచేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా మళ్లాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమల్లో జిల్లాను నెం.1లో నిలపాలన్నారు. ఇంటి పైకప్పుపై రాయితీతో, అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. సొంత ఇల్లు ఉండి, కరెంట్ కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ పథకంపై క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘ మహిళలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. ఇంధనాన్ని ఆదాచేసే గృహోపకరణాలను వినియోగించాలని.. 5 స్టార్ రేటెడ్ ఉపకరణాలు, ఎల్ఈడీ బల్బులు వాడటం వల్ల కరెంటు బిల్లు చాలా తగ్గడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల సమయంలో ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమాలతో పాటు వర్క్షాప్లు, వెబినార్లు, విద్యార్థులకు వ్యాస రచన, పెయింటింగ్ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ఏపీసీపీడీసీఎల్ సీజీఎం ( ఓ అండ్ ఎం) సాంబశివరావు.. విద్యుత్ పొదుపు చర్యలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు, ఊర్జావీర్ కార్యక్రమం పరిధిలో విద్యుత్ను ఆదాచేసే ఉపకరణాల వినియోగం తదితరాలను వివరించారు. అదేవిధంగా ఎనర్జీ ఆడిట్ జీఎం విజయకృష్ణ.. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర విద్యుత్, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ల గురించి వివరించారు. మన దైనందిన జీవితంలో ఇంధన సంరక్షణ చర్యలను పాటించి, రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ.మురళీమోహన్ సూచించారు. కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీల విజేతకు కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి బహుమతులు అందించారు. ఇంధన పొదుపు, పీఎం సూర్యఘర్పై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నవారితో ఇంధన పరిరక్షణ-సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు హాజరయ్యారు.