ఎన్టీఆర్ జిల్లాలోని అన్న క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడనీయం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
నందిగామలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం
రాష్ట్రంలో రెండవ అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్
ప్రజల ఆకలి తీర్చటమే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం
తన పాలనలో పేద ప్రజల కడుపు మాడ్చిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
నందిగామ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వెనకడుగు వేయకుండా అన్ని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్న క్యాంటీన్ల నిర్వహణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పై పడకుండా…దాతల సాయంతో ముందుకు తీసుకువెళతామని..ఇందుకోసం టిడిపి, బిజెపి,జనసేన నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండవ అన్న క్యాంటీన్ ను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నందిగామలో ప్రారంభించారు.
నందిగామ పట్టణంలోని రైతు బజార్ నందు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ప్రారంభించేందుకు విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ శిలాఫలాకం ఆవిష్కరించారు. అనంతరం అన్న క్యాంటీన్ ను ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పేద ప్రజలకు అల్పాహారం అందజేశారు. పార్టీ నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వందరోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మాట ఇచ్చి, 60 రోజుల్లోనే ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే, రాష్ట్రంలో రెండవ అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తను ప్రారంభించటం ఎంతో ఆనందం గా వుందన్నారు. 2014 నుంచి 2019 వరకు పేద వాడి ఆకలి తీర్చటం కోసం అన్న క్యాంటీన్ ప్రారంభిస్తే..గత ప్రభుత్వం కక్షపూరిత ఆలోచనతో వాటిని మూసి వేసిందన్నారు. జగన్ సర్కార్ పేద ప్రజలను ఆకలితో మాడ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కి బడుగు బలహీన వర్గాల ప్రజలంటే కోపమన్నారు.
గత ఐదేళ్లుగా రూ.5లకే భోజనం లభించే అన్న క్యాంటీన్లు లేక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, ఇక పై వారు భోజనం కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సమయానికి కంటే ముందే అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించటంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా వున్నారని, రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము, కంచికచర్ల మండల పార్టీ ప్రెసిడెంట్ కోగంటి బాబు, టిడిపి టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసర్ల లక్ష్మీనారాయణ, నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరాస్వామి, చందర్లపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మేకల సుధాకర్, వీరులపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ కొండ్రుకుంట శ్రీనివాసరావు, తెలుగుదేశం సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, జనసేన సమన్వయకర్త తంబాలపల్లి రమాదేవి, బిజెపి నాయకులు తుర్లికొండ సీతారామయ్య, పట్టణ పార్టీ కౌన్సిలర్లలతో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.