ఎన్టిఆర్ జిల్లా ర్యాటకులను ఆకర్షించేలా కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి చర్యలు..
*కొండపల్లి ఖిల్లా పై మౌలిక వసతులను కల్పించేందుకు కృషి..*
*జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.*
జిల్లాలో చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన కొండపల్లి ఖిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా సాంస్కృతిక, పురావస్తు, మ్యూజియం, టూరిజం శాఖల సమన్వయంతో కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ఖిల్లా అభివృద్ధి చేసేందుకు గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి జి. వాణి మోహన్ ఇతర అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాకు తలమానికమైన కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అత్యంత ప్రాశస్థ్యం కలిగిన ఖిల్లా చరిత్రను సజీవంగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేక శ్రద్ద పెట్టడం జరిగిందన్నారు. 2019వ సంవత్సరంలో కొండపల్లి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందన్నారు. కొండపల్లి కోట చరిత్ర సజీవంగా నిలిపే విధంగా మరమత్తులు నిర్వహించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఖిల్లాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఫోటోను యాప్ ద్వారా అండ్రాయిడ్ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ చిత్రం యొక్క విశిష్టతను తెలుసుకునేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో పునరుద్ధరించిన కొండపల్లి పోర్టు నిర్వహణ క్రమేపి తగ్గిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో విజన్ డాక్యుమెంట్లో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. కొండపల్లి పోర్టులో ఉన్న మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. కొండపల్లి ప్రాంతానికి, ఖిల్లాకు మరింత ప్రచారం కల్పించి రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాల పర్యాటకులు తప్పనిసరిగా కొండపల్లిని సందర్శించాలన్న దృక్పదాన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వం నుండి విడుదల చేసే నిధులతో పాటు జిల్లా యంత్రాంగం పరంగా కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి జి. వాణి మోహన్ మాట్లాడుతూ దాదాపు 10వ శతబ్ధం కాలం నుండి స్వాతంత్య్రం సిద్ధించే వరకు అనేక మంది రాజులు కొండపల్లి కోట నుండి పరిపాలన సాగించేవారన్నారు. ఎంతో చారిత్రాత్మికమైన కొండపల్లి కోట దాదాపు శిధిలావస్థలోకి చేరుకున్న తరుణంలో 2019 సంవత్సరంలో కొండపల్లి కోటను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొండపల్లి కోటను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మరమత్తులు, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రత్యేక రోజులలో కొండపల్లి పోర్టు నందు పర్యాటకులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు హంగులు ఆర్భాటాల ఖర్చులేకుండా సహజసిద్ధమైన వాతావరణంలో శుభకార్యాలు నిర్వహించుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలని ఆలోచన చేస్తున్నామని తద్వారా కొండపల్లి కోటకు మరింత ప్రాచుర్యం ఏర్పడుతుందని వాణి మోహన్ తెలిపారు.
కొండపల్లి ఖిల్లా పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట టూరిజం శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వై.వి. ప్రసన్నలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి ఏ.శిల్ప, సహాయ టూరిజం అధికారి డి. గోపాల్, పురావస్తు శాఖ ఉపసంచాలకులు ఓ. రామ సుబ్బారెడ్డి, పి. సురేష్, సహాయ సంచాలకులు స్వామినాయక్, నరసింహ నాయుడు, ఎస్. వెంకట్రావు, డివియం చైతన్య, స్థానిక తహశీల్థార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.