Home Political news ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు.

3
0

మచిలీపట్నం, జూన్ 19 

ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి కొళాయి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన సాకారం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. 

మంత్రి బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న పనులు వాటి పురోగతి సమీక్షించారు. 

ఇరిగేషన్ శాఖకు సంబంధించి జిల్లాలో సాగునీటి కాలువలు డ్రైన్లలో తూడు తొలగింపు పూడిక తీత పనులు, షట్టర్ మరమ్మత్తులు వంటి సాగునీటి నిర్వహణ పనులు చేపట్టుటకు రు. 55 కోట్లతో 245 పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపినట్లు, వీటిల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో రు.17 కోట్లతో 63 పనులు ప్రతిపాదించినట్లు అధికారులు తెలుపగా, వర్షాకాలం వచ్చినా ఇంతవరకు సాగునీటి కాలువల నిర్వహణ పనులు చేపట్టకపోవడం పట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించి జిల్లాలో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కులాయి అందించాలని లక్ష్యంతో బందరు నియోజకవర్గంలో రూ. 225 కోట్లతో 212 పనులు చేపట్టినట్లు అధికారులు తెలుపగా, గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పనకు తాగునీటి చెరువుల ఏర్పాటుకు డి పి ఆర్ తయారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి కులాయి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు.

ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని, అందుకోసం ముందుగానే అవసరమైన ఇండెంట్ పెట్టాలన్నారు. రైతు భరోసా కింద రైతులకు అందించిన పెట్టుబడి సాయం గురించి మంత్రి ఆరా తీశారు. 

బందర్ పోర్టు అభివృద్ధి పనులు పురోగతి గురించి మంత్రి ఆరా తీశారు. రు.5156 కోట్లతో నాలుగు బెర్త్ లతో 13 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో, 2025 అక్టోబర్ నాటికి మొదటి దశ పూర్తి చేసే లక్ష్యంతో బందర్ పోర్టు అభివృద్ధి పనులు చేపట్టినట్లు, ఇప్పటివరకు 709 కోట్లు వ్యయం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించగా, బందరు పోర్టు అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షిస్తామన్నారు.

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 క్రింద రు.57.33 కోట్ల నిధులు మంజూరయ్యాయని, వీటితో పట్టణంలో తాగునీటి సరఫరా పరిస్థితి మెరుగుపరచడం వంటి పనులు వెంటనే చేపట్టాలన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ బందరు మండలం పోలాటితిప్ప, కోన ప్రాంతంలో మరియు బుద్ధాల పాలెం ప్రాంతంలో పీ హెచ్ సి లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక శారద నగర్, రైలు పేట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాలు వెంటనే వినియోగంలోకి తేవాలన్నారు.

నగరంలో శానిటేషన్ మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ కోతలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాల్సిందేనని, ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో వెంటనే చేపట్టాలన్నారు. 

డిఆర్డిఎ ద్వారా జూలై 1వ తేదీన ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా సామాజిక పింఛన్లు పంపిణీ చేపట్టాలన్నారు. చాలాకాలంగా పింఛన్ల మంజూరు పెండింగ్ ఉన్నాయని, వెంటనే క్లియర్ చేయాలి అన్నారు. 

అందరం కలిసికట్టుగా పనిచేసి బందర్ నియోజకవర్గాన్ని ఆదర్శివంతంగా తీర్చిదిద్ధుదామని, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని అన్నారు. 

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ సమావేశంలో మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై నివేదికలు నియోజకవర్గాల వారీగా సిద్ధం చేయాలన్నారు.

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ వో కె చంద్రశేఖర రావు, బందర్ ఆర్డీవో ఎం వాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here