ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చే “అమరావతి చిత్ర కళా వీధి” పోస్టర్ ఆవిష్కరణ
ఈరోజు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటితో కలిసి “అమరావతి చిత్ర కళా వీధి” పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం ఆంధ్రప్రదేశ్ లోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందని అన్నారు. ప్రతిభావంతులైన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించడంలో తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
తేజస్వి పోడపాటి మాట్లాడుతూ, సంవత్సరాలుగా విస్మరించబడిన కళాకారులను ప్రోత్సహించడానికి సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదని, కళాకారుల సాధికారతకు ఒక స్పష్టమైన చర్య అని, కళాకారుల సంఘం నుండి అపూర్వమైన స్పందన లభించిందని ఆమె పునరుద్ఘాటించారు.
2025 ఏప్రిల్ 4న రాజమండ్రి, లాలా చెరువు రోడ్డులో జరగనున్న “అమరావతి చిత్ర కళా వీధి” కార్యక్రమం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి, కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుంది.