ఎన్టీఆర్ జిల్లా, మే 21, 2025
ఉపాధి హామీ పథకంలో ఉచితంగా పండ్ల తోటల పెంపకం

- కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా రైతులను ప్రోత్సహించండి
- ఉద్యాన పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయాలు
- పశుగ్రాసం పెంపకంపైనా అవగాహన కల్పించాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఉపాధి హామీ పథకం ఆసరాతో ఉచితంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టవచ్చని.. ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంతో పాటు పశుగ్రాసం పెంపకానికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయాలు లభిస్తాయని, ఈ నేపథ్యంలో అన్నదాతలను ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా ఉద్యాన పంటల సాగు చేపట్టేలా చేయిపట్టి నడిపించాలన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లి, గులాబి తోటల పెంపకానికి సన్న-చిన్నకారు రైతులు (అయిదెకరాల లోపు) అర్హులన్నారు. ఉదాహరణకు మామిడికి ఎకరానికి వివిధ రూపాల్లో రూ. 1,09,950 సాయమందుతుందన్నారు. అదేవిధంగా జామకు ఎకరానికి రూ. 1,46,971 మేర సాయమందుతుందని వివరించారు. ఎకరంలో 1,600 మల్లె మొక్కల పెంపకానికి దాదాపు రూ. 1,85,396 సహాయం అందించడం జరుగుతుందన్నారు.
*పశువులు కలిగిన సొంత భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు పశుగ్రాసం పెంపకాన్ని కూడా చేపట్టవచ్చని.. 0.50 ఎకరాలో పశుగ్రాసం పెంపకానికి రూ. 32,992 ఖర్చవుతుందని అంచనా వేయగా.. వివిధ పనులకు ఈ మొత్తం మెటీరియల్ లేదా వేజ్ కాంపొనెంట్గా అందించడం జరుగుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, వితంతు, విభిన్న ప్రతిభావంతులైన రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఎంపీడీవో లేదా ఉపాధి హామీ ఏపీవో లేదా గ్రామ సచివాలయ ఉద్యాన అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. వ్యవసాయ, ఉద్యాన రైతులు కూడా లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఉద్యాన తోటలకు ఉపయోగపడేలా పంట కుంటలు నిర్మాణాలను చేపట్టాలని, తద్వారా మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏడీఏ అనిత, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష తదితరులు పాల్గొన్నారు.