ఎన్టీఆర్ జిల్లా, తేది 31.07.2024
ఉపాధి హామి పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఊతం
జిల్లాలో 1760 ఎకరాలలో పండ్లు, పూల తోటల పెంపకం
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
ఉపాధి హామి ఊతంతో చిన్న సన్నకార రైతులకు నూరు శాతం సబ్బిడి క్రింద ఉద్యాన పంటలను చేపట్టి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నామని జిల్లాలో 1760 ఎకరాలలో పండ్లు, పూలతోటల పెంపకాన్ని చేపట్టినట్లు *జిల్లా కలెక్టర్ డా.జి.సృజన*, తెలిపారు.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మైలవరం మండలం కొత్త మంగాపురంలో చేపట్టిన మల్లెతోటలను బుధవారం జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు.
ఈ సందర్భంగా కొత్త మంగాపురం మల్లెతోట రైతు కుప్పాళ్ళ ముత్తయ్య నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను బలహీన వర్గానికి చెందిన రైతునని జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా ఒకటిన్నర ఎకరాలలో మల్లెతోట సాగును ప్రారంభించినట్లు తెలిపారు. మల్లె తోట పెంపకానికి గుంతలు తీయడం, మొక్కల కొనుగోలు, మొక్కలు నాటడం, పాదులు తీయడం, నీరు పోయడం, ఎరువులు వేయడం దుక్కి దున్నడానికి అవసరమయ్యే పూర్తి ఖర్చులను ఉపాధి హామి పథకం ద్వారా పొందడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. ఈ ప్రాంతం మల్లె సాగుకు ఎంతో అనుకూలమని మార్కెట్ సౌకర్యం కూడా ఉండడంతో తన ఆర్థిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని తన లాంటి రైతులకు ఉపాధి హామి పథకం ఎంతో ఉపయోగపడుతుందని రైతు ముత్తయ్య కలెక్టర్కి వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1760 ఎకరాలలో జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా పండ్లు, పూల తోటల సాగును చేపట్టేలా రైతులను ప్రొత్సహించడం జరిగిందన్నారు. 40 ఎకరాలలో రైతులు మల్లె, గులాబి తోటల పెంపకాన్ని చేపట్టారని, మిగిలిన 1720 ఎకరాలలో మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ, సీతాఫలం, డ్రాగన్ పూట్, జీడిమామిడి దానిమ్మ, నేరేడు, ఆపిల్బేర్, మునగ, పామాయిల్ వంటి పండ్ల జాతి మొక్కల పెంపకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రైతులు వారికి అవసరమైన నాణ్యత గల పూలు, పండ్ల మొక్కలు, ఎరువులను నేరుగా కొనుగోలు చేసుకునేందుకు ఉపాధి హామి పథకం నిధుల ద్వారా చెల్లించడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటడానికి గుంతలు తీయడం, మొక్కలు నాటడంతో పాటు మూడు సంవత్సరాల పాటు మొక్కల పెంపకం నిర్వహణకు అంతర పంటలు చేపట్టేందుకు అయ్యే పనులను జాతీయ ఉపాధి హామి పని దినాలలో కేటాయించడం జరుగుతుందన్నారు. చిన్న సన్నకారు రైతులకు పండ్లు, పూల తోటల పెంపకం ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని పండ్లు పూల సాగును చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ఉపాధి హామి ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. సృజన తెలిపారు.
మల్లె తోట సందర్శనలో కలెక్టర్ వెంట జాతీయ ఉపాధి హామి పథకం ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత, డిపివో యన్.వి. శివ ప్రసాద్ యదవ్, ఏపిడి వెంకటేశ్వరరావు, ప్లాంటేషన్ మేనేజర్ కె. ఉషారాణి, ఇంజనీరింగ్ కన్స్ల్టెంట్ ఎస్ వంశీ కృష్ణ, రైతులు పాల్గొన్నారు