*09.03.2025*
ఉపనయనాలు నిర్వహించటం హర్షణీయం
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
ఉపనయన కార్యక్రమాలు నిర్వాహకులు ఉచితంగా నిర్వహించడం హర్షణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రామకోటి మైదానం దగ్గర రోటరీ విజ్ఞాన మందిరం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు, విజయవాడ శ్రీ భువనేశ్వరీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి వారు విచ్చేసి వటువులకు ఆశీస్సులు అందజేశారు. భిక్షాటన, యజ్ఞోపవీతం ధరించిన అనంతరం ఆచరించవలసిన నియమాలపై ముఖ్య అతిథులు వటువులకు వివరించారు.
ఈ సందర్భంగా *మల్లాది విష్ణు* మాట్లాడుతూ.. ఎన్నో రోజుల నుంచి కార్యక్రమ నిర్వహణకై కార్యాచరణ రూపొందించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం పట్ల నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిఒక్క వటువు త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్రోపాసనం తప్పనిసరిగా ఆచరించాలన్నారు. అప్పుడే వారి జీవన స్థితిగతులు ఉన్నత స్థాయికి చేరుకుంటాయన్నారు. అలాగే 16 ఏళ్ల వయస్సు లోపే ఉపనయనాలను పూర్తిచేసుకోవలసిందిగా బ్రాహ్మణ బాలురకు సూచించారు. ప్రతిఒక్క బ్రాహ్మణుడు తన దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ త్రికాల సంధ్యావందనాన్ని మరువకూడదని మల్లాది విష్ణు అన్నారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వటువులపై ఉండాలని ఆకాంక్షించారు.
శ్రీశ్రీశీ కమలానంద భారతీస్వామి వారు* మాట్లాడుతూ త్రికాల సంధ్యావందన విశిష్టతను వివరించారు. సంధ్యావందనం సమయంలో సూర్య శక్తిని పొందేందుకు మనషికి ఉన్న శక్తి చాలదు కనుక గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క వటువు క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించే విధంగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొప్పరపు బలరామకృష్ణ మూర్తి, సెక్రటరీ తణుకు రామకృష్ణ, నాయకులు కొప్పరపు మారుతీ, యల్లాప్రగఢ సుధీర్, చాంద్ శర్మ, హనుమాన్ ప్రసాద్, ఆర్కే, ఉపనయనం చేసుకున్న 25 మంది వటువులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.