*ఎన్టీఆర్ జిల్లా, జులై 05, 2024*
యూపీఎస్సీ ఈపీఎఫ్వో, ఈఎస్ఐసీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 7న విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
25 కేంద్రాల్లో 7,834 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
ఈ నెల 7వతేదీ ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించనున్న ఈపీఎఫ్వో-పర్సనల్ అసిస్టెంట్, ఈఎస్ఐసీ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు.
యూపీఎస్సీ ఈ నెల 7న ఈపీఎఫ్వోలో పర్సనల్ అసిస్టెంట్, ఈఎస్ఐసీలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ సృజన శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో యూపీఎస్సీ పరిశీలకులు అశోక్ కుమార్, డీఆర్వో వి.శ్రీనివాసరావుతో కలిసి లైజన్ కమ్ రూట్ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల సూపర్ వైజర్లు, సహాయ సూపర్ వైజర్లు తదితరులతో సమావేశం నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విజయవాడలో తొమ్మిది కేంద్రాల్లో ఈపీఎఫ్వో, 16 కేంద్రాల్లో ఈఎస్ఐసీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈపీఎఫ్వో పరీక్షకు 2,401, ఈఎస్ఐసీ పరీక్షకు 5,433 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 9.30 గం. నుంచి 11.30 గం. వరకు ఈపీఎఫ్వో-పర్సనల్ అసిస్టెంట్ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈఎస్ఐసీ నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణకు 25 మంది లైజన్ కమ్ రూట్ అధికారులు, 25 మంది సూపర్వైజర్లు, 25 మంది సహాయ సూపర్వైజర్లు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరం మేరకు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో అదనపు బస్సులను నడపాలని ప్రజా రవాణా అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీల నిఘాకు, 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను చేయాలని.. తాగునీరు అందుబాటులో ఉంచడం, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లు ముఖ్యమన్నారు. అభ్యర్థులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చూడాలని కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.
సమావేశంలో కలెక్టరేట్, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, మునిసిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.