ఎన్టీఆర్ జిల్లా, జులై 17, 2025
ఈ నెల 19న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర..
- ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు
- దుష్పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై ప్రజలను జాగృతం చేయండి
- స్వయం సహాయక సంఘ మహిళలు, విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించండి
- విద్యా సంస్థల్లో ఎకో క్లబ్లను క్రియాశీలం చేయాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి, సకల ప్రాణకోటి మనుగడుకు పెను ముప్పు ఉందని.. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్కు ఫుల్స్టాప్ పెట్టి, ఆహ్లాదకర వాతావరణాన్ని భావితరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఈ మహత్తర లక్ష్య సాధనకు ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రతో పాటు వివిధ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాల విజయవంతానికి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు మార్గదర్శకాలకు ఇచ్చిందని, ఇందులో భాగంగా ఈ నెల ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్తో కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. మెల్లమెల్లగా మన జీవితాలు ప్లాస్టిక్ ఉచ్చులో చిక్కుకున్నాయని.. ఇప్పుడు మేలుకోకుంటే మరి కోలుకోలేమని, ప్రజలు, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు సమష్టి భాగస్వామ్యంతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమాజం నుంచి దూరం చేద్దామని పిలుపునిచ్చారు. ర్యాలీలు, సమావేశాలు, కరపత్రాలు, కళా ప్రదర్శనలు, డిజిటల్ కంటెంట్ తదితరాల ద్వారా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ దుష్పరిణామాలు, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో గ్లాస్ బాటిల్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్యాకింగ్ వంటివాటిని ప్రోత్సహించాలన్నారు. రైతు బజార్లు, అన్ని రకాల దుకాణాల్లోనూ పాలిథీన్ సంచులు ఉపయోగించకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఎకో క్లబ్లను క్రియాశీలం చేసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా జాగృతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.