*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 06, 2025*
ఈ నెల 10న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం
– *సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*
– *నులిపురుగులతో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుంది*
– *చిన్నారులు, కిశోర బాలల్లో మానసిక వికాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి*
– *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, వివిధ శాఖల అధికారులు సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రతో కలిసి ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులతో నేరుగా, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నులి పురుగులు ఉన్న పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుందని.. ఎక్కువగా అలసిపోతారని, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు వంటివాటితో పాటు బరువు తగ్గుతుందన్నారు. వివిధ శారీరక సమస్యలతో పాటు మానసిక వికాసం కూడా మందగిస్తుందని వివరించారు. అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూడొచ్చన్నారు. ఈ నెల 10న 1-19 ఏళ్ల వయసు వారందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరుగుతుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి, తమ పిల్లలు మాత్రలు తీసుకునేలా చూడాలన్నారు. 1-2 సంవత్సరాల చిన్నారులకు సగం మాత్ర (200 మి.గ్రా.), ఆపైన 19 ఏళ్ల వయసు వరకు ఒక మాత్ర (400 మి.గ్రా.) ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అల్బెండజోల్ సురక్షితమైన మాత్ర అని.. దానిని బాగా చప్పరించి, శుభ్రమైన తాగునీటితో కలిపి మింగాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 10న మాత్రలు తీసుకోకుండా మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 17వ తేదీన మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో గోడపత్రికల ద్వారా నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించి.. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేసేందుకు కృషిచేయాలన్నారు. మాత్రలు ఎలా వేయాలనే దానిపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థల్లోనూ కార్యక్రమం తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మాత్రల పంపిణీ అనంతరం చేతుల శుభ్రతపై చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం పరంగా చేకూరే ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, జెడ్పీ సీఈవో కె.కన్నమ నాయుడు, డీసీహెచ్ఎస్ బీసీకే నాయక్, డీపీవో పి.లావణ్య కుమారి, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి,
జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డా. మాధవి నాయుడుతో పాటు ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.