ఎన్టీఆర్ జిల్లా, మే 26, 2025 ఆవేదనను ఆలకించారు.. ట్రై సైకిళ్లు అందించారు.దివ్యాంగుల ఆవేదనను ఆలకించి ఆపై సత్వరం స్పందించి మూడు చక్రాల సైకిలును అందజేసి జీవిత మార్గానికి బాటవేసిన జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) దివ్యాంగుల జీవన మార్గానికి బాటలు వేసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లో ఒక కార్యక్రమాన్ని ముగించుకొని పర్యటనకు బయలుదేరుతున్న సమయంలో దివ్యాంగుణ్ని చూసి చలించి అతని వద్దకు వెళ్లి అర్జీని స్వీకరించి అదేరోజు బాధితునికి మూడు చక్రాల సైకిల్ను అందించిన వార్తా కథనాన్ని చూసి అదే పరిస్థితిలో ఉన్న మరికొందరు తమకు కూడా న్యాయం జరుగుతుందనే ఆశతో మే 12వ తేదీన జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నగరంలోని 21వ డివిజన్కు చెందిన సింహాద్రి క్షీరవర్ధి, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన అన్నవరపు వరప్రసాద్లు తాము నిరుపేద కుటుంబాలకు చెందినవారమని ఎలాంటి జీవనాధారం లేదని, నడవలేని స్థితిలో ఉన్న తమకు మూడు చక్రాల సైకిళ్లను అందజేసి ఆదుకోవాలని తద్వారా ఏదో ఒక జీవన మార్గాన్ని వెతుక్కుంటామని అర్జీలను సమర్పించారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం దివ్యాంగుల అర్హతలను పరిశీలించి దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను సమకూర్చడంపై జిల్లా రెవెన్యూ అధికారి దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల సహాయంతో సోమవారం కలెక్టరేట్లో ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు. అతి తక్కువ సమయంలో తమకు ఉచితంగా వాహనాలు అందజేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.*పీజీఆర్ఎస్ ద్వారా 167 అర్జీల స్వీకరణ:*సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా 167 అర్జీలు స్వీకరించినట్లు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 65, పోలీస్ 30, ఎంఏయుడి 14, పంచాయతీరాజ్ 6, సర్వే 4, డిఆర్డిఏ 5, వైద్య ఆరోగ్యం 2, హౌసింగ్ 8, ఏపీసీపీడీసీఎల్ 2, డ్వామా 2 , జలవనరులు 2, బీసీ కార్పోరేషన్కు 7, ఎస్సీ కార్పొరేషన్ 1, వ్యవసాయం 2, గ్రామ, వార్డు సచివాలయాలు 3, ఉపాధి కల్పన 1, మార్కెటింగ్ 2, ఆర్డబ్ల్యూఎస్ 1, ఆర్ అండ్ బీ 3, నైపుణ్యాభివృద్ది 1, సాంకేతిక విద్య 1, విభిన్న ప్రతిభావంతులు 1, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 3, బ్యాంకింగ్ 1 అర్జీలు ఉన్నాయన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా జిల్లా అధికారులు క్షుణ్నంగా పరిశీలించి, గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
