ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి
శాసనసభ్యులు సుజనా చౌదరి
వైసిపి ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా తయారైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజన చౌదరి) అన్నారు. గురువారం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వలన వైసిపి గద్దెనెక్కి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. వైసిపి పాలన పీడకలగా మర్చిపోయి భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవం ప్రధాని మోడీ సమర్థవంతమైన పాలనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండమైన విజయాన్ని అందించారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిలిచిపోయిన ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాజధాని అమరావతి అభివృద్ధిని యజ్ఞంలా పూర్తి చేసి సంపద సృష్టించాలన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని గడచిన ఐదేళ్లుగా రాజధాని ప్రాంత రైతులు చేసిన ఉద్యమాలకు సంఘీభావం తెలిపి వారికి అండగా నిలబడ్డామన్నారు. రానున్న రోజుల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రాజధాని అమరావతి ని పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సుజనా చౌదరి కోరారు.