అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు దృష్టిపెట్టాలి
– అర్జీలు రీఓపెన్ అయ్యే పరిస్థితి ఉండకూడదు
– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 85 అర్జీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కార నాణ్యతపై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పాల్గొన్నారు. తొలుత పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధించి రిసెప్షన్, సమాచార కౌంటర్తో పాటు రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, ఆధార్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులతో కలిసి
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 85 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 42, మునిసిపల్, పట్టణాభివృద్ధికి సంబంధించి 8, పోలీస్ శాఖకు సంబంధించి 7 అర్జీలు వచ్చాయి. ఏపీసీపీడీసీఎల్, డీఆర్డీఏ, సహకార శాఖలకు నాలుగు చొప్పున అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్, విద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలకు రెండు చొప్పున, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఇంటర్మీడియెట్ విద్య, ఉపాధికల్పన, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారులు-భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి.. అర్జీదారుడు సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అదేశించారు.
*విజయవంతంగా చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు:*
జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సందర్భంగా ఏర్పాటుచేసిన వర్మీ కంపోస్ట్ అమ్మకపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామపంచాయతీ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం ద్వారా తయారుచేసిన వర్మి కంపోస్టు విక్రయాలను పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా కిలో వర్మి కంపోస్ట్ ప్యాకెట్ రూ. 20కు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వివరించారు. అరకిలో, కిలో, రెండు కిలోల ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. మొక్క వేగంగా, ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వర్మీ కంపోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశా ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించడం జరుగుతోందని.. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.