అమ్మవారికి సారె సమర్పించిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 7.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధులు ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. శ్రీ మహా చండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని అధికారులు, వేద పండితుల బృందం అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఈవో ఆజాద్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఏటా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీ మహా చండీ దేవి అలంకృత అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందని వివరించారు.