అమరావతి రాజధాని నిర్మాణంలో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న రెండు ప్రాజెక్ట్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్లతో నిర్మించే ప్రాజెక్ట్లని ఆమోదించింది. రూ.1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రూ. 1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. 2018 నుంచి పెండింగ్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్లకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.