అమరావతి జపం తప్ప ప్రజా సమస్యలు పట్టవా..?
– *వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు*
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి జపం తప్ప.. ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ నగరంలో అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. ఇప్పటివరకు కనీసం రూ. వెయ్యి కోట్లు కేటాయించిన పాపాన పోలేదన్నారు. బుడమేరు వరదల సమయంలో రెండున్నర లక్షల కుటుంబాలు నష్టపోతే.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయారని ఆరోపించారు. ఓవైపు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతూనే.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వేల కోట్ల రూపాయలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అవి కూడా చాలవన్నట్లు హడ్కో ద్వారా, కేఎఫ్ డబ్ల్యూ ద్వారా అప్పులు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో నెలకొన్న సమస్యలు తీర్చవలసిన బాధ్యత మీపై లేదా..? అని సూటిగా ప్రశ్నించారు. గత ఆరున్నర నెలల కాలంలో 175 నియోజకవర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్నో ప్రజలకు వివరించాలన్నారు. అంతేగానీ చివరకు కరువు ప్రాంతాలను కూడా పట్టించుకోని విధంగా అమరావతి జపం చేయడం ఎంతవరకు సమంజసం మల్లాది విష్ణు అన్నారు. తాము అభివృద్ధికి, అమరావతికి వ్యతిరేకం కాదని.. కానీ నిధులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ద్వారా హైదరాబాద్ తరహాలో మరో తప్పు జరుగుకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. పాలన అంటే కేవలం రాష్ట్ర సచివాలయం ఒక్కటే కాదని.. గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా కింది స్థాయి వరకు తమ హయాంలో సజావుగా పాలన సాగించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
*అప్పుల ప్రభుత్వం*
కూటమి ప్రభుత్వం పూర్తిగా అప్పుల ప్రభుత్వంగా మారిపోయిందని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. తమ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని లబోదిబోమన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాలలోకి వెళ్లిందని.. కానీ కూటమి సర్కారు తీసుకొచ్చిన రూ. వేల కోట్ల అప్పులు ఏమయ్యాయో..? సమాధానం చెప్పాలన్నారు. ఆరున్నర నెలల కాలంలో మొత్తం ఆదాయ, వ్యయాలు శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.