అన్నదానం సేవా మార్గానికి అత్యుత్తమం
అన్నదాన సేవ పూర్వజన్మ సుకృతం
వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. ఢిల్లీ రావు
విజయవాడ :
మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో అన్నదానం,ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. తాడేపల్లి లోని విజయవాడ క్లబ్ రోడ్ లో గల ఆర్. ఎల్. గౌతమి రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ నివాసితుల ఎన్.ఎస్.వి. ప్రసాద్ నన్నపనేని, రేవతి నన్నపనేని దంపతులు, అక్షయితి, శ్రీహిత, నన్నపనేని కుటుంబ సభ్యుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన నిర్వహణ కోసం పంపుతున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి గురువారం ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ
హిందువులు భక్తిప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమన్నారు.
సమాజంలో ఎంతోమంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది మరింత ముందు దాతలు ధార్మిక కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంకల్పం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు.
కూరగాయలను విరాళంగా అందించిన నన్నపనేని ప్రసాద్, రేవతి దంపతులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం మాకు
కలిగిందన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంతో పాటు వేసి విదేశాలలోని స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నారన్నారు. దేవదేవుడుని దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తోందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు.
భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.