అదానితో ఒప్పందాలను రద్దు చేయాలి
దమ్ముంటే జగన్ పరువు నష్ట దావా వేయాలి:- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
మోదీకి కోపం వస్తుందని చంద్రబాబుకి భయం:- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
విజయవాడ:- విద్యుత్ చార్జీల విషయంలో అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ట్రూ ఆప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొదని, అదానిపై విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. స్థానిక బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల రూపంలో ఇంత త్వరగా దాదాపు 15 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై వేస్తుందని, ఊహించలేదన్నారు. మోదీ ప్రధానిగా ఉండగా తన వెంట్రుక కూడా పీకలేరని మాజీ ఎంసీ జగన్ ధైర్యంగా ఉన్నాడని, అదాని వద్ద లంచం తీసుకున్న జగన్ తనను విమర్శిస్తే పరువు నష్టం దావా వేస్తానని బెదిరిస్తున్నారని చెప్పారు. విమర్శిస్తున్న తమపై దుమ్ముంటే జగన్ పరువు నష్టం దావా వేయాలని సవాల్ విసిరారు. సెకీతో నుంచి విద్యుత్ కొనుగోలు కోసం అదాని, అబూరి పవర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదన్నారు. జగన్, అదానితో సమావేశం అయిన తరువాత ఆ సమావేశ వివరాలను ప్రజలకు తెలియజేయాలని సీపీఐగా తాము డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. జగన్ చేసిన అక్రమాలపై కమ్యూనిస్టు పార్టీ హైకోర్టులో పిటీషన్ వేయటంతో అబూరి కంపెనీ వెనక్కు వెళ్లిందన్నారు. అదే సమయంలో నాటి పీఏసీ చైర్మన్గా ఉన్న నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా హైకోర్టులో పిటీషన్ వేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కావాల్సిన సమాచారం సీఎం వద్ద ఉన్నా మోదీకి బయపడి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విద్యుత్ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదాని, జగన్ల వ్యవహారంపై విచారణ చేయకపోతే చంద్రబాబుకి స్థానం ఉండదని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా చార్జీలు పెంచటం దుర్మార్గం అన్నారు. అదాని వ్యవహారం అమెరికా నుంచి ఆంధ్రా వరకు ప్రపంచాని కుదిపేస్తుందన్నారు. అదానీని ప్రశ్నిస్తే మోదీకి కోపం వస్తుందనే భయంతో చంద్రబాబు నోరెత్తటం లేదన్నారు. స్మార్ట్ మీటర్లు తొలగించండి ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు బిగించాలని చెప్పటం ప్రజలను మోసం చేయటమే అవుతుందన్నారు. సర్వే రాళ్ళను ప్రక్కన పెట్టినట్టే స్మార్ట్ మీటర్లను ప్రక్కన పెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్, సాగునీటి ప్రాజెక్టుల పన్నులు వేస్తామని చెపుతూ ప్రజలను భయపెడుతుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే వైసీపీకి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ చేపట్టే పోరాటంలో ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీపీఎం ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్.బాబూరావు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు ఎస్కే.సలీమ్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, సీపీఐ నాయకులు డీవీ రమణ బాబు, తాడి పైడియ్య, కొట్టు రమణరావు, తూనం వీరయ్య, ఎస్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అదాని అవినీతి అక్రమాలపై ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవిష్కరించారు