ఎన్టీఆర్ జిల్లా, మార్చి 12, 2025
అదనపు లబ్ధితో సొంతింటి కల సాకారం చేసుకోండి
ఎస్సీ, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు అదనపు ప్రయోజనం
లబ్ధిదారులు ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకోవాలి
మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గృహ నిర్మాణాలను పూర్తిచేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, పట్టణ) 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ
రూ. 1,80,000కు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెం. 09 విడుదల చేసిందని.. ఈ అదనపు లబ్ధితో పేదల సొంతింటి కల సాకారం కానుందని తెలిపారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకొని సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలు, పీవీటీజీ (పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలు)లకు రూ. లక్ష అదనపు సాయం అందుతుందని వివరించారు. ఎస్సీలకు సంబంధించి ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు సంబంధించి 556 ఇళ్లు, బీసీలకు సంబంధించి 4,018 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా రూ. 1.80 లక్షల యూనిట్ విలువకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకోవాలన్నారు.
*ఈ నెల 15 నుంచి క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్:*
ఇంకా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించి వడివడిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేసుకునేలా ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ అమెనిటీ సెక్రటరీలు తదితరులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గృహ నిర్మాణ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకునేలా సమన్వయం చేసుకునేందుకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని.. ఇందులో భాగంగా పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. మీడియా సమావేశంలో గృహ నిర్మాణ పీడీ ఆర్.లీలారాణి, డీఈ ఒ.విజయబాబు, ఈఈ జి.కపూర్ పాల్గొన్నారు.