అన్ని శాఖల సమన్వయం…
భక్తులకు సులభతరమైన దర్శనం…
నగర పోలీస్ కమిషనర్
ఎస్వీ రాజశేఖర్ బాబు…
విజయవాడ :
అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల విజయవంతం కోసం రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, దేవాదాయ శాఖలు.
.. సమన్వయంగా బాధ్యతలు నిర్వహించడంతో సామాన్య భక్తులకు సులభతరమైన దర్శన భాగ్యం లభిస్తోందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. ఆదివారం సతీ సమేతంగా జగజ్జనని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవస్థానం వేద పండితులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ నిరంతరం క్యూలైన్లను పరిశీలిస్తోందని, సమయానుకూలంగా భక్తులకు త్వరితగతిన దర్శనం లభించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా విఐపి దర్శనాల కోసం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించడంతో సాధారణ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగడంలేదన్నారు. ఇంత పెద్ద భారీ కార్యక్రమం జరిగే సమయంలో కొన్ని సందర్భాలలో శాఖల మధ్య సమన్వయ లోపంతో కొన్నిసార్లు క్యూలైన్ల లోని భక్తులకు దర్శనం ఆలస్యం కావడం జరుగుతోందని వివరించారు. పోలీసు శాఖ వాటిని కూడా గుర్తించిందని, అటువంటి ఆలస్యం జరగకుండా మరింత అప్రమత్తతతో పనిచేస్తుందన్నారు.