విజయవాడ, నందిగామ, మే 06, 2024
అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
– పీవో, ఏపీవోలకు సంతృప్తికరంగా రెండో దశ శిక్షణ
– ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాలతో హోం ఓటింగ్
– ఈ నెల 7, 8, 9 తేదీల్లో పీవీసీల ద్వారా అత్యవసర సేవల సిబ్బందికి ఓటింగ్ సదుపాయం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాడి మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం నందిగామలో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక కేవీఆర్ కళాశాలలో జరుగుతున్న పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్వహించాల్సిన విధులను వివరించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశముంది? వాటిని అప్పటికప్పుడు ఎలా అధిగమించాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను స్వయంగా క్షుణ్నంగా వివరించారు. 17 ఏ రిజిస్టర్, పీవో డైరీ, విజిట్ షీట్, ఫారం-14ఏ జాబితా, మాక్పోల్, పోల్, అసైన్డ్ ఓటర్లు, మార్క్డ్ కాపీ ఓటర్లు, సీయూ-1 ఓటర్లు, సీయూ-2 ఓటర్లు, క్లియరింగ్ మాక్పోల్ డేటా, క్లోజ్ బటన్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం, వీవీప్యాట్స్ తదితర ముఖ్యమైన అంశాలపై కలెక్టర్ డిల్లీరావు స్వయంగా వివరించారు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు:*
నందిగామ ఆర్వో స్థాయిలో సేవలందిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలనతో పాటు పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని.. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టికేంద్రీకరించడం జరుగుతుందని.. వెబ్క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రోఅబ్జర్వర్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఆర్వో స్థాయితో పాటు కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4, 5 తేదీల్లో 9,636 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు వివరించారు. 6న కూడా ప్రక్రియ సజావుగా జరగ్గా.. 7, 8 తేదీల్లోనూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోల స్థాయిలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు (వీఎఫ్సీ) పనిచేస్తాయన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడి.. ఏ కారణం చేతనైనా ఇప్పటివరకు ఫారం-12 సమర్పించని వారికి ఈసీఐ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో అవకాశం కల్పించడం జరిగిందని.. ఓటు ఉన్న నియోజకవర్గ ఆర్వో పరిధిలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో 7 లేదా 8వ తేదీల్లో ఒక రోజు స్పెషల్ క్యాజ్వల్ లీవ్నుఉపయోగించుకొని డ్యూటీ ఆర్డర్ను చూపించి.. ఫారం-12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లా మొత్తంమీద 17 వేల నుంచి 18 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యేందుకు అవకాశముందన్నారు. ఈ నెల 7, 9 తేదీల్లో ప్రత్యేక బృందాల ద్వారా హోం ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హోం ఓటింగ్ సౌకర్యం పొందేందుకు 1,052 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫారం-12డీ సమర్పించిన వైద్యులు, ఆర్టీసీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితర అత్యవసర సేవల సిబ్బందికి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని కేంద్రీకృత పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ)తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోల స్థాయిలోనూ పీవీసీల ద్వారా ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కలెక్టర్ వెంట ఆర్వో ఇ.కిరణ్మయి, నందిగామ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో, ఆర్వో ఎ.రవీంద్రరావు ఉన్నారు.