*ఎన్టీఆర్ జిల్లా, జనవరి 24, 2025*
అత్యంత పారదర్శకంగా
గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ
11 దుకాణాలకు ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
జిల్లాలో 11 మద్యం దుకాణాలను గీత కార్మికుల ఉప కులాలకు కేటాయించేందుకు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ గీత కార్మికుల ప్రతినిధులు, అధికారులు సమక్షంలో డ్రా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ నగరం, జగ్గయ్యపేట మున్సిపాలిటీ, వీరులపాడు మండలం, తిరువూరు మండలం, ఎ.కొండూరు మండలం, నందిగామ మండలం, జగ్గయ్యపేట రూరల్ మండలాలకు ఒక్కొక్కటి చొప్పున ఏడు మద్యం దుకాణాలను గౌడ కులస్థులకు డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ, వత్సవాయి, రెడ్డిగూడెం మండలాలకు ఒక్కొక్కటి చొప్పున మూడు మద్యం దుకాణాలను గౌడ్ కులస్థులకు ఎంపిక చేయడం జరిగిందని, విసన్నపేట మండలం మద్యం దుకాణాన్ని శెట్టి బలిజ కులస్థులకు డ్రా ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, ఈ నెల 27వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు.
కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వీ రామశివ, అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి, గీత కార్మికుల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.