ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 23, 2024
అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
ప్రత్యేక శిబిరాలను పరిశీలించిన సీఈవో వివేక్ యాదవ్
ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ అన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025లో భాగంగా 2024, అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగింది. ఈ జాబితాపై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదే విధంగా 2025, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేయించుకోవచ్చు. ఇలా మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి అందిన దరఖాస్తులను డిసెంబర్ 24వ తేదీలోగా పరిష్కరించి, 2025, జనవరి 6న తుది జాబితా ప్రచురిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశారు. బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, మాంటిస్సోరి కళాశాలలోని శిబిరాలను శనివారం సీఈవో వివేక్ యాదవ్.. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా తదితరులతో కలిసి పరిశీలించారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు సవరణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పరిశీలించారు. శని, ఆదివారం రెండు రోజుల పాటు పోలింగ్ స్టేషన్లలోని ప్రత్యేక శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5 గంటల వరకు సేవలందిస్తాయని, బీఎల్వోలు అర్జీలు స్వీకరిస్తారని.. ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు.